Begin typing your search above and press return to search.

లలిత్‌ మరకను తుడిచేసిన బీసీసీఐ..!

By:  Tupaki Desk   |   29 Jun 2015 1:36 PM GMT
లలిత్‌ మరకను తుడిచేసిన బీసీసీఐ..!
X
మోడీ వేసిన మరక తుడిచే ప్రయత్నం చేసింది బీసీసీఐ. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భారత ఆటగాళ్లతో పాటు.. మరో విదేశీ ఆటగాడి ప్రమేయం ఉందంటూ లలిత్‌ మోడీ చేసిన ఆరోపణ ఏమాత్రం సరికాదని బీసీసీఐ తేల్చేసింది.

సురేష్‌రైనా.. రవీంద్ర జడేజా.. బ్రేవోలకు రియల్‌ఎస్టేట్‌ దిగ్గజం భారీ ముడుపులు ఇచ్చినట్లుగా లలిత్‌ మోడీ ఆరోపించారు. దీంతో ఒక్కసారి కలకలం రేగింది. మాజీ ఐపీఎల్‌ చీఫ్‌ నోటి నుంచే ముడుపుల ఆరోపణలు రావటంతో ఒక్కసారి సంచలనం రేగింది. అయితే.. మోడీ మాటల్ని మొగ్గలోనే తుంచాలని బీసీసీఐ భావించింది. లలిత్‌ మోడీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. లలిత్‌ మోడీ మాటలతో కలిగే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేపట్టింది.

జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించిన అనంతరం బోర్డు కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ఆటగాళ్లకు ఎలాంటి ముడుపులు అందలేదని స్పష్టం చేశారు. బీసీసీఐ చేసిన వ్యాఖ్యలపై లలిత్‌ మోడీ మౌనం దాలుస్తారా? లేక.. మరేదైనా ఆధారాన్ని బయటకు తీసి మరింత కెలికే ప్రయత్నం చేస్తారా? అన్నది చూడాలి.