Begin typing your search above and press return to search.

మేధావులంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:30 AM GMT
మేధావులంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు
X
స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడే అయినా.. జ‌న‌సామ్యానికి పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. మెగాస్టార్ తీస్తున్న సినిమా పుణ్య‌మా అని ఇప్పుడాయ‌న తెగ ఫేమ‌స్ అయ్యారు. ఉయ్యాల‌వాడ గొప్ప‌త‌నాన్ని ఇప్ప‌టి త‌రానికి తెలియ‌జేయాల‌న్న ఉద్దేశంతో చిరు సినిమా తీస్తుంటే.. తెలుగు భాష ప‌రిర‌క్ష‌ణ వేదిక క‌న్వీన‌ర్.. తమిళ‌నాడు తెలుగు యువ‌శ‌క్తి అధ్య‌క్షుడు కేతిరెడ్డి జగ‌దీశ్వ‌ర‌రెడ్డి గ‌డిచిన కొంత కాలంగా ఇదే త‌ర‌హా నినాదంతో వ‌ర్క్ చేస్తున్నారు. తాజాగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని వారి కుటుంబ‌స‌భ్యుల‌కు సంఘీభావాన్ని తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఉయ్యాలవాడకు సంబంధించి తాము చేస్తున్న వ‌ర్క్ గురించి చెప్పుకొచ్చారు. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలంటూ రాష్ట్రప‌తి.. ప్ర‌ధానితో స‌హా ప‌లువురు కేంద్ర‌మంత్రుల్ని క‌లిశామ‌ని.. ఇందుకు సంబంధించిన ఒక విన‌తిప‌త్రాన్ని వారికి అందించిన‌ట్లుగా చెప్పారు. ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లిసి అమ‌రావ‌తిలో ఉయ్యాల‌వాడ వారివిగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరిన‌ట్లు వెల్ల‌డించారు.

ఉయ్యాల‌వాడ‌ను జాతీయ వీరుడిగా గుర్తించాల‌ని.. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో చిత్ర‌ప‌ఠం.. లేదంటే విగ్ర‌హం.. వర్సిటీల్లో మోమెరియాల్ లెక్చ‌ర్స్ ఇవ్వ‌టం.. ఉయ్యాల‌వాడ వ‌ర్థంతిని సెల‌వుగా ప్ర‌క‌టించాల‌ని.. పోస్ట‌ల్ స్టాంప్ విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. త‌న డిమాండ్స్ విష‌యంలో కేంద్రం.. వివిధ ప్ర‌భుత్వ విభాగాలు వెల్ల‌డించిన వివ‌రాల్ని ఆయ‌న పంచుకున్నారు.

అయితే.. ఇందులో ఏదీ సానుకూలంగా లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఉదాహ‌ర‌ణ‌కు వ‌స్తే.. ఉయ్యాల‌వాడ న‌రసింహారెడ్డి చిత్ర‌ప‌టాన్ని పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేయాల‌న్న అభ్య‌ర్థ‌న‌పై స్పందిస్తూ.. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో ఖాళీ లేద‌ని రిప్లై రావ‌టం గ‌మ‌నార్హం. ఇదే రీతిలో మిగిలిన అంశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఉయ్యాల‌వాడ జీవితాన్ని సైరా పేరిట మెగాస్టార్ తీస్తున్న సినిమాకు సంబంధించి.. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డితో మాట్లాడ‌టం జ‌రిగింద‌ని.. ఉయ్యాల‌వాడ కీర్తి ప్ర‌తిష్ట‌ల‌కు ఎలాంటి భంగం వాటిల్ల‌కుండా ఉండేలా సినిమా తీస్తున్న‌ట్లుగా త‌న‌కు చెప్పిన‌ట్లు కేతిరెడ్డి వెల్ల‌డించారు.

ఉయ్యాల‌వాడ పాత్ర‌లో చిరును ఎప్పుడెప్పుడు చూస్తామ‌న్న ఆస‌క్తితో తెలుగు ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పారు. ఇటీవ‌ల ఒక‌రు మేధావి ముసుగులో ఉయ్యాల‌వాడ గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. అలాంటి వారు మేధావి ముసుగులో ఉన్న మూర్ఖులుగా అభివ‌ర్ణించారు. పిచ్చి పిచ్చి మాట‌ల‌తో తాము మేధావుల‌మ‌న్న భ్ర‌మ‌లో ఉండొద్దంటూ కేతిరెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.