Begin typing your search above and press return to search.

చిరంజీవి, బాలయ్య సినిమాలు చేసి ఉంటేనా?

By:  Tupaki Desk   |   9 Dec 2017 8:27 AM GMT
చిరంజీవి, బాలయ్య సినిమాలు చేసి ఉంటేనా?
X
‘మౌన పోరాటం’ లాంటి సినిమాలతో ఒకప్పుడు చాలా మంచి పేరు సంపాదించింది హీరోయిన్ యమున. ఐతే ఆమె కథానాయికగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది. త్వరగా ఫేడవుట్ అయిపోయి.. సినిమాలకు టాటా చెప్పేసి సీరియళ్లకు పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఐతే తనకు సరైన ప్లానింగ్.. గైడెన్స్ లేకపోవడం వల్లే తాను పెద్ద హీరోయిన్ కాలేకపోయానంటూ తాజాగా ఒక వెబ్ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది యమున. తాను చిరంజీవి.. బాలకృష్ణ.. మోహన్ బాబు లాంటి పెద్ద హీరోలతో నటించాల్సిన కథానాయికనని.. కానీ దురదృష్టవశాత్తూ ఆ అవకాశాలు మిస్ చేసుకున్నానని ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబుతో ‘అల్లుడు గారు’ సినిమాలో తానే కథానాయికగా నటించాల్సిందని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను మిస్ చేసుకున్నానని ఆమె తెలిపింది. ఆ రోజుల్లో తనకు ఫోన్ లేకపోవడం వల్ల ఆ చిత్ర బృందం తనను కాంటాక్ట్ చేయలేకపోయిందని.. తనకు ఇండస్ట్రీ జనాలతో సరైన పరిచయాలు లేకపోవడం శాపంగా మారిందని ఆమె తెలిపింది. ఇక చిరంజీవి.. బాలయ్యలతో కూడా తాను సినిమాలు మిస్సయినట్లు ఆమె తెలిపింది. ‘కొదమ సింహం’ సినిమాకు తనను కథానాయికగా తీసుకోవాలని చిరంజీవి భావించినట్లు ఓ సందర్భంలో కైకాల సత్యనారాయణ చెప్పారని.. అలాగే బాలయ్య తన కోసం ‘ఉషా కిరణ్ మూవీస్’ వాళ్లను సంప్రదించారని తర్వాత తెలిసిందని ఆమె చెప్పింది. ‘మౌనపోరాటం’ తర్వాత ఆ సినిమా నిర్మాణ సంస్థతో తనకు కమిట్మెంట్లు ఉండటం వల్ల చిరు.. బాలయ్యలతో నటించలేకపోయినట్లు ఆమె తెలిపింది. ఇలా మిస్సయిన సినిమాల్ని తాను చేసి ఉంటే తన స్థాయే వేరుగా ఉండేదని ఆమె అభిప్రాయపడింది.