Begin typing your search above and press return to search.

చేజేతులా సినిమాను చంపుకున్నారే..

By:  Tupaki Desk   |   7 Dec 2018 1:30 AM GMT
చేజేతులా సినిమాను చంపుకున్నారే..
X
తనకు తాను బర్నింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చుకుని.. తన తొలి సినిమాకు ‘హృదయ కాలేయం’ అనే వెరైటీ టైటిల్ పెట్టుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు సంపూర్ణేష్ బాబు. ఆశ్చర్యకరంగా ‘హృదయ కాలేయం’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు సంపూ. ఆ తర్వాత అతను హీరోగా ‘సింగం 123’.. ‘వైరస్’ లాంటి కొన్ని సినిమాలేవో చేశాడు కానీ.. అవేవీ అతడికి మంచి ఫలితాన్నివ్వలేదు.

తొలి సినిమాతో ఎంత వేగంగా పైకి లేచాడో.. అంతే వేగంగా కింద పడిపోయాడు. ఐతే ‘హృదయ కాలేయం’ తీసిన దర్శక నిర్మాత సాయి రాజేష్.. తన ప్రొడక్షన్లో సంపూ హీరోగా ‘కొబ్బరి మట్ట’ అనే సినిమా మొదలు పెట్టి.. వెరైటీగా ప్రమోట్ చేయడంతో దీనిపై జనాల్లో కొంత ఆసక్తి మొదలైంది జనాల్లో. మొదట్లో ‘హృదయ కాలేయం’ తరహాలోనే దీన్ని బాగానే జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. ఒక దశలో దీనికి మంచి క్రేజ్ కూడా కనిపించింది.

అలాంటి టైంలోనే సినిమాను రిలీజ్ చేయగలిగి ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ ఏం జరిగిందో ఏమో.. సినిమాకు బ్రేకులు పడ్డాయి. కొన్నాళ్ల తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. మళ్లీ మధ్య మధ్యలో సినిమాను బయటికి తీసి హడావుడి చేశారు కానీ.. మళ్లీ కథ మామూలే. రెండు నెలల కిందట సినిమా పూర్తయిందని.. విడుదలకు సిద్ధంగా ఉందని అన్నాడు సాయి రాజేష్. నవంబరు రిలీజ్ అని కూడా ప్రకటించాడు.

ఎమోషనల్ గా ఒక మెసేజ్ కూడా పెట్టాడు. అన్నీ చేశాడు కానీ.. సినిమాను మాత్రం రిలీజ్ చేయలేకపోయాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డ నేపథ్యంలో జనాలకు సినిమాపై ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఇప్పుడు సినిమా పరిస్థితేంటో అర్థం కావడం లేదు. జనాలకు ఆసక్తి ఉన్నపుడు ఎలాగోలా సినిమాను రెడీ చేసి రిలీజ్ చేయాల్సింది. కానీ మంచి అవకాశాల్ని వృథా చేసుకున్నారు. ఇప్పుడిక ఈ చిత్రం ఎప్పటికి బయటికి వస్తుందో చూడాలి.