Begin typing your search above and press return to search.

క్రైమ్ బ్రాంచ్ ముందుకు హీరో విశాల్!

By:  Tupaki Desk   |   12 Jun 2019 4:25 AM GMT
క్రైమ్ బ్రాంచ్ ముందుకు హీరో విశాల్!
X
తెలుగువాడైన‌ హీరో విశాల్ న‌డిగ‌ర‌ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తంబీల్లో హ‌వా సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌డిగ‌ర‌సంఘం.. నిర్మాత‌ల మండ‌లిలో తెలుగు వాడి హ‌వాని తంబీలు నిర‌సిస్తూ కుట్ర‌లకు పాల్ప‌డ‌డంపై హైద‌రాబాద్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక న‌డిగ‌ర సంఘం ఆస్తుల వ్య‌వ‌హారంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌స్తుతం పోలీస్ విచార‌ణ సాగుతోంది. కాంచీపురం జిల్లా వేంకట మగళంలో నడిగర్ సంఘానికి చెందిన 26 సెంట్ల స్థలం క్ర‌య‌విక్ర‌యాల‌ విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ సంఘం మాజీ అధ్య‌క్షుడు శ‌ర‌త్ కుమార్ - కార్య‌ద‌ర్శి రాధార‌విల‌పై విశాల్ బృందం ఆరోపించ‌డ‌మే గాక‌.. ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో పోరాడుతున్నారు. మ‌ద్రాస్ హైకోర్టులో కేసు విచార‌ణ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే సంఘంలోని కీల‌క వ్య‌క్తుల‌పై పోలీస్ ఎంక్వ‌యిరీ వేడెక్కిస్తోంది.

తాజాగా దీనిపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు ప్ర‌స్తుత కార్య‌ద‌ర్శి విశాల్ కాంచీపురం పోలీసుల ముందుకు వ‌చ్చారు. వాస్త‌వానికి ఈ పాటికే పోలీసుల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉండ‌గా తాను వేరొక చోట షూటింగ్ లో ఉండ‌డం వ‌ల్ల నేర‌ప‌రిశోధ‌న పోలీసుల ముందు హాజ‌రు కాలేక‌పోయాన‌ని విశాల్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ కేసులో పోలీసుల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తాన‌ని అన్నారు.

ఓవైపు న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈ స‌మ‌యంలో ఇలా కోర్టు విచార‌ణ‌ల‌తో విశాల్ స‌హా ప్ర‌త్య‌ర్థి బృందం ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైనం క‌నిపిస్తోంది. ఇక‌పోతే శ‌రత్ కుమార్ పై న్యాయ పోరాటంలో నెగ్గేందుకు విశాల్ చాలా పంతంతో ఉన్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ వివాదాల న‌డుమ ఈసారి న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. అలాగే న‌డిగ‌ర సంఘం సొంత బిల్డింగ్ గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ స‌భ్యుల్లో సాగుతోంది.