Begin typing your search above and press return to search.

జూనియర్‌ శ్రీదేవిపై గోవిందుడి ఆసక్తి..!

By:  Tupaki Desk   |   26 Sep 2018 10:35 AM GMT
జూనియర్‌ శ్రీదేవిపై గోవిందుడి ఆసక్తి..!
X
విజయ్‌ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్‌ లో ఒక సెన్షేషన్‌, ఈయన ప్రస్తుతం యూత్‌ ఐకాన్‌. కేవలం ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో స్టార్‌ హీరోగా మారిపోయిన విజయ్‌ దేవరకొండ చేతిలో లెక్కకు మించిన ఆఫర్లు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా కూడా ఈయన వద్ద నిర్మాతలు క్యూ కట్టి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క మంచి ఆఫర్‌ కు కమిట్‌ అవుతూనే ఉన్న విజయ్‌ దేవరకొండ తాజాగా మైత్రి మూవీస్‌ బ్యానర్‌ లో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ నుండి సమాచారం అందుతుంది.

వచ్చే వారం విజయ్‌ దేవరకొండ నటించిన ‘నోటా’ చిత్రం విడుదల కాబోతుంది. మరో వైపు ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. తాజాగా మైత్రి మూవీస్‌ బ్యానర్‌ లో వచ్చే ఏడాది ఆరంభం నుండి సినిమా చేసేందుకు విజయ్‌ దేవరకొండ డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం దర్శకుడు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాని హీరోయిన్‌ విషయంలో మాత్రం ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో ఆసక్తికర చర్చకు తెర లేచింది.

మైత్రి మూవీస్‌ వారు తీసుకు వచ్చిన కథ విన్న తర్వాత విజయ్‌ దేవరకొండకు ఈ కథకు శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ హీరోయిన్‌ గా అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడట. విజయ్‌ దేవరకొండ సూచన మేరకు మైత్రి మూవీస్‌ నిర్మాతలు ప్రస్తుతం బాలీవుడ్‌ లో తమకున్న పరిచయాల ద్వారా జాన్వీని హీరోయిన్‌ గా నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

హిందీలో ‘ధడక్‌’ చిత్రంతో పాజిటివ్‌ టాక్‌ ను దక్కించుకున్న జాన్వీ మరో రెండు సినిమాలను హిందీలోనే చేస్తూ ఉంది. మరి ఆమెకు తెలుగులో నటించే ఆసక్తి ఉందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ విజయ్‌ దేవరకొండతో జాన్వీ నటిస్తే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం అంటున్నారు. నోటా విడుదలైన తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది.