Begin typing your search above and press return to search.

బ్రేకింగ్!... రాళ్ల‌ప‌ల్లి ఇక లేరు!

By:  Tupaki Desk   |   17 May 2019 5:57 PM GMT
బ్రేకింగ్!... రాళ్ల‌ప‌ల్లి ఇక లేరు!
X
తెలుగు చ‌ల‌న చిత్ర సీమ టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. సీనియ‌ర్ న‌టుడు - ప్ర‌ముఖ కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాళ్ల‌పల్లి (73) కాసేప‌టి క్రితం మ‌ర‌ణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్ళపల్లి హైద‌రాబాద్ లోని మ్యాక్స్ క్యూర్‌ ఆసుప‌త్రిలో చిక్కిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు.

రాళ్ల‌ప‌ల్లిగా మ‌న‌కు చిర‌ప‌ర‌చితులైన ఆయ‌న పూర్తి పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు. 1955 అక్టోబరు 10న తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించిన రాళ్ల‌ప‌ల్లి చిన్న నాటి నుంచే నాట‌కాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌ర‌చారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం కుక్కకాటుకు చెప్పుదెబ్బతో సినీ రంగప్రవేశం చేశారు. ఊరుమ్మడి బతుకులు అనే చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు.

నాటకరంగంలో విశేష అనుభవం ఉండడంతో ఆయనకు చిత్రసీమలో ఎదురులేకుండా పోయింది. రాళ్లపల్లి ఓవైపు సినిమాల్లో నటిస్తూ కూడా నాటకాలు వేశారు. ఆ విధంగా తన వయసు సహకరించేవరకు దాదాపు 8000 నాటక ప్రదర్శనలు ఇవ్వడం విశేషం అని చెప్పాలి. ఆయన చివరగా నటించిన చిత్రం మారుతి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన భలేభలే మగాడివోయ్.

ఆపై వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఇంటికే పరిమితయ్యారు. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే బుల్లితెర‌పైనా రాళ్ల‌ప‌ల్లి క‌నిపించారు. ప‌లు సీరియ‌ళ్ల‌లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. తెలుగు సినీ రంగంలో సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగిన రాళ్ల‌ప‌ల్లి... కేరెక్ట‌ర్ ఆర్టిస్టుగా - క‌మెడియ‌న్ గా - కొన్ని సినిమాల్లో విల‌న్ గానూ రాణించారు. రాళ్ల‌ప‌ల్లి మ‌ర‌ణం వార్త‌తో టాలీవుడ్ విషాదం అల‌ముకుంది.