Begin typing your search above and press return to search.

మలయాళ దర్శకుడికి వెంకీ గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   30 Aug 2016 7:30 PM GMT
మలయాళ దర్శకుడికి వెంకీ గ్రీన్ సిగ్నల్
X
‘బాబు బంగారం’ నెగెటివ్ టాక్ తో మొదలైనా మంచి కలెక్షన్లు తెచ్చుకుని విక్టరీ వెంకటేష్ లో ఉత్సాహం నింపింది. ఈ ఊపులో ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని చకచకా పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు వెంకీ. విక్టరీ హీరో తర్వాతి సినిమా ‘ఇరుదు సుట్రు’ రీమేకే. తమిళ-కన్నడ భాషల్లో మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ తీసిన సుధ కొంగరనే ఈ చిత్రాన్నీ రూపొందిస్తుంది. సెప్టెంబర్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. మరోవైపు దీని తర్వాత వెంకీ చేసే సినిమా ఏదో కూడా తేలిపోయింది. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రిప్టుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వెంకీ నటించిన ‘దృశ్యం’ ఒరిజినల్ కు జీతూనే దర్శకుడు.

‘దృశ్యం’ సినిమా చూశాక ఇంప్రెస్ అయ్యి అతడితో పని చేయడానికి వెంకీ ఆసక్తి చూపించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా రావచ్చని చాన్నాళ్ల కిందటే వార్తలొచ్చాయి. ఐతే అప్పటికి ఇంకా కథ సంగతి తేలలేదు. ఇటీవలే జీతూ పూర్తి స్థాయి స్క్రిప్టుతో వెంకీని మెప్పించాడు. ‘ఇరుదు సుట్రు’ రీమేక్ నాలుగు నెలల్లోనే పూర్తి చేయబోతున్నాడు వెంకీ. వచ్చే ఏడాది ఆరంభంలో వెంకీ-జీతూ సినిమా మొదలు కావచ్చు. వెంకీ అన్నయ్య సురేష్ బాబే ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముంది. మరోవైపు వెంకీ-రానా కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు సురేష్ బాబు. ప్రస్తుతం రచయితలతో కథ రెడీ చేయించే పనిలో ఉన్నాడు. ఆ సినిమా కూడా వచ్చే ఏడాదే మొదలు కావచ్చు.