Begin typing your search above and press return to search.

తేజ సినిమా పక్కనపెట్టి పూరితో??

By:  Tupaki Desk   |   22 Jan 2018 4:04 AM GMT
తేజ సినిమా పక్కనపెట్టి పూరితో??
X
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన వెంకటేష్ ఈమధ్య బాగా స్లో అయ్యాడు. గురు సినిమా తరవాత ఇంతవరకు ఏ ప్రాజెక్టునూ పట్టాలెక్కించలేదు. వెంకటేష్ ఫ్యామిలీ బ్యానర్ సురేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానాతో నేనే రాజు - నేనే మంత్రి తీసిన తేజతో తరవాత సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. వెంకీ ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతానికి పక్కన పెట్టి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా చేసేందుకు ఆలోచన చేస్తున్నాడనేది టాలీవుడ్ లో లేటెస్ట్ టాక్.

మిగిలిన జోనర్లతో పోలిస్తే పొలిటికల్ జోనర్ లో సినిమా తీసి మెప్పించడం కష్టం. కానీ నేనే రాజు - నేనే మంత్రి సినిమాను డైరెక్టర్ తేజ తీసిన తీరు అందరినీ మెప్పించింది. అందుకే తన తండ్రి నందమూరి తారకరామారావు జీవితగాథతో తీసే సినిమాకు బాలకృష్ణ ఏరికోరి తేజను డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కు రంగం సిద్ధమైంది. ఓవైపు ఎన్టీఆర్ బయోపిక్ తీస్తూ మరోవైపు తనతో తీసే సినిమా తీయడమంటే ఒకే సమయంలో రెండు పడవలపై ప్రయాణంలా ఉంటుందని వెంకీ ఫీలయ్యాడట. దీంతో ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ కంప్లీట్ చెయ్యాల్సిందిగా డైరెక్టర్ తేజకు చెప్పాడనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. ఈలోగా పూరి జగన్నాథ్ సినిమా పూర్తి చేయడం గురించి వెంకి ఆలోచనలో పడ్డాడని తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా మెహబూబా తీస్తున్నాడు. ఇది పూర్తయ్యాకే వెంకటేష్ సినిమా గురించి ఆలోచించగలడు. కాబట్టి వెంకీ సినిమా షూటింగ్ ఏది స్టార్ట్ కావాలన్నా మరికొంత కాలం వెయిట్ చెయ్యాలి. తప్పదు.