Begin typing your search above and press return to search.

పరువు హత్యకు గురైన ప్రణయ్‌ కి పాట అంకితం!

By:  Tupaki Desk   |   18 Sep 2018 1:02 PM GMT
పరువు హత్యకు గురైన ప్రణయ్‌ కి పాట అంకితం!
X
ఇటీవలే మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద సంచలనం అయిన విషయం తెల్సిందే. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ మరియు అమృతల విషాద ప్రేమ కథ ప్రస్తుతం అందరిని కలచి వేస్తోంది. అమృత తండ్రి మారుతీ రావు దాదాపు కోటి రూపాయల సుఫారీ ఇచ్చి మరీ ప్రణయ్‌ ని హత్య చేయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈ సంఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. రామ్‌ - చిన్మయి ఇంకా పలువురు పరువు హత్యపై తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ‘వీర భోగ వసంత రాయలు’ చిత్ర టీం ప్రణయ్‌ కి పాటను అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.

నారా రోహిత్‌ - సుధీర్‌ బాబు - శ్రీవిష్ణులు హీరోలుగా శ్రియ హీరోయిన్‌ గా నటించిన ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రం మొదటి పాటను ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాటను పరువు హత్యకు గురైన ప్రణయ్‌ కి అంకితం ఇవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రణయ్‌ హత్య అందరిని కచి వేసింది. అలాంటి ప్రణయ్‌ కి పాటను అంకితం ఇవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులను సోషల్‌ మీడియాలో అంతా కూడా అభినందిస్తున్నారు.

ముగ్గురు హీరోల మల్టీస్టారర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ చకచక జరుగుతుంది. ఈ చిత్రానికి ఇంద్రసేన ఆర్‌ దర్శకత్వం వహిస్తుండగా - అప్పారావు నిర్మిస్తున్నాడు. ముగ్గురు హీరోల చిత్రం అవ్వడంతో ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. దానికి తోడు ప్రణయ్‌ కి పాట అంకితం చేయడంతో సినిమాపై మరింతగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.