Begin typing your search above and press return to search.

మిస్టర్-ఫిదా మధ్య నలిగిపోయాడట

By:  Tupaki Desk   |   20 July 2017 5:08 PM GMT
మిస్టర్-ఫిదా మధ్య నలిగిపోయాడట
X
ఇప్పుడున్న హీరోలందరూ దాదాపుగా ఒక సినిమా చేశాకే.. ఇంకొకటి మొదలుపెడతారు. ఈ రోజుల్లో ఒకేసారి రెండు సినిమాల్ని లైన్లో పెట్టి.. సమాంతరంగా వాటి షూటింగ్ లో పాల్గొనడం అంటే కొంచెం కష్టమైన వ్యవహారమే. ఐతే మెగా కుర్రాడు వరుణ్ తేజ్.. ఒకేసారి ‘మిస్టర్’.. ‘ఫిదా’ సినిమాల్ని లైన్లో పెట్టాడు. కాస్త ముందు వెనుకగా ఆ రెండు సినిమాల్ని పూర్తి చేశాడు. ఐతే ఒకేసారి రెండు సినిమాలు చేయడంలో ఉన్న ఇబ్బందేంటో తనకు బాగా అర్థమైందని అతను చెప్పాడు. ఈ రెండూ విభిన్నమైన సినిమాలు కావడం.. రెంటికీ భిన్నమైన నటన.. హావభావాలు ప్రదర్శించాల్సిన అవసరం రావడంతో తాను ఇబ్బంది పడ్డట్లు అతను తెలిపాడు.

‘మిస్టర్’ దర్శకుడు శ్రీను వైట్ల.. ‘ఫిదా’ డైరెక్టర్ శేఖర్ కమ్ములలది భిన్నమైన శైలి అని.. అలాగే వాళ్లు తనతో చేసిన సినిమాలు కూడా భిన్నమైనవని అన్నాడు వరుణ్. ‘ఫిదా’ షూటింగ్ లో పాల్గొని ‘మిస్టర్’ సెట్ కు వెళ్తే.. అక్కడ తన నటన మరీ సాత్వికంగా.. సటిల్ గా ఉంటోందని.. సింపుల్ గా ఉంటోందని శ్రీను వైట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వరుణ్ తెలిపాడు. అలాగే ‘మిస్టర్’ సినిమా షూట్లో పాల్గొని.. ‘ఫిదా’ సెట్లోకి అడుగుపెట్టాక అక్కడ తన యాక్టింగ్ హైపర్ గా ఉంటోందని కమ్ముల అబ్జెక్ట్ చేశాడని వరుణ్ తెలిపాడు. ఇలా రెండు సినిమాలకు తగ్గట్లుగా అడ్జెస్ట్ చేసుకుని ఎలాగోలా పని పూర్తి చేశానని వరుణ్ తెలిపాడు. ఐతే ఈ రెండు సినిమాల్లో ‘మిస్టర్’ వరుణ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి ‘ఫిదా’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.