Begin typing your search above and press return to search.

టెన్షన్‌ వద్దు.. 'అత్తారింటికి దారేది' ఆగదు

By:  Tupaki Desk   |   15 Nov 2018 7:36 AM GMT
టెన్షన్‌ వద్దు.. అత్తారింటికి దారేది ఆగదు
X
తమిళ స్టార్‌ హీరో శింబు ఎంత వివాదాస్పదుడు అయినా కూడా ఆయనకు భారీ ఫ్యాన్స్‌ ఉంటారు. శింబు యాటిట్యూడ్‌ కారణంగా అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు. ఈమద్య కాలంలో సూపర్‌ హిట్‌ లు ఏమీ లేకున్నా కూడా శింబును ఆయన ఫ్యాన్స్‌ అభిమానిస్తూనే ఉంటారు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘నవాబ్‌’ చిత్రంతో శింబు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ చిత్రం తమిళంలో రీమేక్‌ అవుతుంది. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ఫిల్మ్‌ మేకర్స్‌ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రంను అడ్డుకుంటామని గతంలో శింబుతో సినిమా చేయాలని అడ్వాన్స్‌ ఇచ్చిన ఒక నిర్మాత హెచ్చరిస్తున్నాడు.

శింబు కొన్నాళ్ల క్రితం ‘అన్భనవన్‌ అసరదవన్‌ అదన్గదవన్‌’(అఅఅ) చిత్రం చేసేందుకు నిర్మాతల వద్ద అడ్వాన్స్‌ తీసుకున్నాడు. ఆ చిత్రం షూటింగ్‌ కొంత పూర్తి అయిన తర్వాత ఏదో కారణం వల్ల సినిమా నుండి శింబు తప్పుకున్నాడట. శింబు ఆ సినిమా నుండి తప్పుకోవడంతో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయాం అంటూ చట్టపరమైన చర్యలకు సిద్దం అయ్యారట. తమ బ్యానర్‌ లో మొదలు పెట్టిన ‘అఅఅ’ చిత్రంను పూర్తి చేసిన తర్వాతే శింబు మరే సినిమాను అయినా విడుదల చేసుకోవాలంటూ ఆ నిర్మాతలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

ఈ సమయంలో అత్తారికింటికి దారేదికి రీమేక్‌ అయిన ‘వంత రాజవతాన్‌ వరువెన్‌’ విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో శింబు ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఫ్యాన్స్‌ ఆందోళన నేపథ్యంలో శింబు స్పందించాడు. వంత రాజవతాన్‌ వరువెన్‌ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల అవుతుందని, ఏ ఒక్కరు కూడా ఈ సినిమాను ఆపలేరు అన్నాడు. ఏక పక్షంగా సాగే నిర్ణయం ఏది కూడా అమలు కాదని, అభిమానులు ఆవేశపడకుండా వేచి చూడాలని శింబు కోరాడు. ఈ రీమేక్‌ ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి సినిమా వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.