Begin typing your search above and press return to search.

క్రేజీ బ్యానర్‌ లో చైతూ మూవీ?

By:  Tupaki Desk   |   20 Nov 2018 2:30 PM GMT
క్రేజీ బ్యానర్‌ లో చైతూ మూవీ?
X
ప్రభాస్‌ తో ‘మిర్చి’ చిత్రాన్ని నిర్మించడంతో గుర్తింపు దక్కించుకున్న యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు వరుసగా పెద్ద - చిన్నా అని చూడకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక వైపు ప్రభాస్‌ తో ‘సాహో’ వంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ మూవీని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్‌ తాజాగా గీతాఆర్ట్స్‌ 2 తో కలిసి ‘ట్యాక్సీవాలా’ చిత్ర నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించింది. వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న వంశీ - ప్రమోద్‌ లు తాజాగా నాగచైతన్యతో ఒక చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

చిన్న చిత్రాలైనా కూడా సొంతంగా నిర్మించకుండా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. పెద్ద సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల చిన్న చిత్రాలను ఇతర నిర్మాతలతో కలిసి నిర్మిస్తే ఎక్కువ టెన్షన్‌ ఉండదు అనేది యూవీ నిర్మాతల ఆలోచన అయ్యి ఉంటుంది. అందుకే నాగచైతన్యతో నిర్మించబోతున్న చిత్రాన్ని కూడా మరో బ్యానర్‌ తో కలిసి నిర్మించబోతున్నారు. నిరంజన్‌ రెడ్డికి చెందిన మ్యాట్నీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సంస్థ తో కలిసి చైతూ మూవీని వంశీ మరియు ప్రమోద్‌ లు ప్లాన్‌ చేస్తున్నారు.

విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతుందట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందట. చైతూ ప్రస్తుతం తన భార్య సమంతతో కలిసి ‘మజిలి’ అనే చిత్రాన్ని శివ నిర్వాన దర్శకత్వంలో చేస్తున్నాడు. మజిలి పూర్తి అయిన తర్వాత యూవీ క్రియేషన్స్‌ లో సినిమా స్టార్ట్‌ చేస్తాడేమో. త్వరలోనే ఈ చిత్రంకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.