Begin typing your search above and press return to search.

ఆ సీఎం చూపు మిస్‌ వ‌రల్డ్‌ పై ప‌డింది

By:  Tupaki Desk   |   27 April 2018 6:31 AM GMT
ఆ సీఎం చూపు మిస్‌ వ‌రల్డ్‌ పై ప‌డింది
X
త్రిపుర సీఎం బిప్లవ్‌ కుమార్ దేవ్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్దికాలం క్రితం ఇంటర్‌ నెట్ - శాటిలైట్లు కొత్తేమి కాదని మహాభారత కాలం నుంచే అవి భారత్‌ లో మనుగడలో ఉన్నాయని త్రిపుర సీఎం బిప్లవ్‌ కుమార్ అన్న సంగ‌తి తెలిసిందే. కంప్యూటరైజేషన్ - సంస్కరణలపై అగర్తలలో జరిగిన ఓ వర్క్‌ షాప్‌ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బిప్లవ్‌ కుమార్ మాట్లాడుతూ.. లక్షల సంవ్సరాల క్రితమే ఇంటర్‌ నెట్‌ ను భారత్ కనుగొన్నదన్నారు. మహాభారత కాలం నుంచే భారత్‌ లో ఇంటర్‌ నెట్ - శాటిలైట్ సేవలు ఉన్నాయన్నారు. అదే రీతిలో తాజాగా అగర్తలలో జరిగిన హ్యాండ్లూమ్ కార్యక్రమంలో ఆయ‌న‌ మాట్లాడుతూ మాజీ మిస్‌ వరల్డ్ డయానా హెడన్ భారతీయ మహిళ కాదని, కానీ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మాత్రం భారతీయురాలే అని అన్నారు.

దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలోనూ బ్యూటీపార్లర్లు ఉన్నాయని త్రిపుర సీఎం అన్నారు. పురాతన కాలంలో భారతీయ మహిళలు కాస్మొటిక్స్ వాడేవారు కాదని, అసలు షాంపూలు ఉండేవికాదని, కేవలం మట్టితో స్నానం చేసేవారని, కానీ కొన్ని సంస్థలు మార్కెటింగ్ మాఫియాకు పాల్పడుతున్నాయని, అందాల పోటీలు నిర్వహించి తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నాయని సీఎం కుమార్ దేవ్ ఆరోపించారు. అందాల పోటీల విజేతలను ముందుగానే నిర్ణయిస్తారని ఆరోపించారు. ఓ దశలో భారత్‌కు వరుసగా అయిదు సార్లు ప్రపంచ అందెగత్తె అవార్డులు వచ్చాయన్నారు. డయానా హెడన్‌కు కూడా ఆ అవార్డు ఇవ్వడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మన దేశంలో మహిళలను లక్ష్మీదేవిగా, సరస్వతిగా కొలుస్తారు, ఐశ్వర్యరాయ్ భారతీయ స్త్రీలకు నిదర్శనం - కానీ డయానా హెడన్‌ లో ఏం అందం ఉందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు అందాల పోటీల్లో భారత్‌ కు అవార్డులు రావడం లేదని, ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలు తమ మార్కెట్‌ను మరో దేశానికి మార్చాయన్నారు. పార్టీ నేత‌లు బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయరాదు అని ప్రధాని మోడీ హెచ్చరించినా.. బీజేపీ నేతలు మాత్రం తమ నోరును అదుపులో పెట్టుకోవడం లేదని ప‌లువురు అంటున్నారు.