Begin typing your search above and press return to search.

తమ్మారెడ్డి మాట: పవన్.. కొంచెం క్లారిటీ ప్లీజ్

By:  Tupaki Desk   |   22 Feb 2017 6:06 AM GMT
తమ్మారెడ్డి మాట: పవన్.. కొంచెం క్లారిటీ ప్లీజ్
X
ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే మంచిదంటున్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. హోదా విషయంలో కేవలం స్టేట్మెంట్లకే పరిమితమైతే సరిపోదని.. రోడ్డు మీదికి వచ్చి పోరాటం మొదలుపెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కు ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆయనేమన్నారంటే..

‘‘పవన్ కళ్యాణ్ గారు నిన్న చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సభలో బాగా మాట్లాడారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. అంతకుముందు విశాఖపట్నంలో నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ఆపై అమెరికాకు వెళ్లి అక్కడ కూడా మాట్లాడారు. కానీ సమస్య ఏంటంటే.. ఆయన ఆ తర్వాత ఫాలో అప్ ఏమీ చేయట్లేదు. ప్రత్యేక హోదాకు సంబంధించి పవన్ ఏం కోరుకుంటున్నారన్నది అర్థం కావడం లేదు. ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అనే విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి క్లారిటీ కోరుకుంటున్నారా.. లేక ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారా? అన్నదది తెలియడం లేదు. ఆయన ప్రతిసారీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా అంటున్నారు. నిజానికి అటు ప్రధాని మోడీ.. ఆర్థిక మంత్రి జైట్లీ.. మిగతా మంత్రులు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇక్కడి మంత్రులు ఆల్రెడీ ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. అది రాదని స్పష్టంగా చెప్పేశారు. మరి ఎన్నికలకు ముందు వాళ్లకు మద్దతు ఇవ్వమని అడిగారు కాబట్టి.. వాళ్లే తనకు ఫోన్ చేసి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని పవన్ కోరుకుంటున్నారేమో తెలియదు.

ఇక ప్రత్యేక హోదా అన్నది కావాల్సిందే అని పవన్ భావిస్తున్నట్లయితే కేవలం స్టేట్మెంట్లకు పరిమితం అయిపోతే సరిపోదు. నేను రోడ్డు మీదికి వస్తే ఏదో అవుతుందని ప్రతిసారీ పవన్ అంటున్నారు. కానీ అలా వచ్చి పోరాటం చేయకపోతే ప్రత్యేక హోదా అన్నది ఎప్పటికీ రాదు. తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా ప్రత్యేక హోదా వస్తే మంచిదే అంటున్నారు. మీరూ రావాలంటున్నారు. జగన్ కూడా ముందు నుంచి ప్రత్యేక హోదా మీద పోరాడుతున్నారు. అందరూ కూడా ఎవరైనా తెస్తే మేం ముందే చెప్పాం కదా అని క్రెడిట్ తీసుకుందాం అన్నట్లుగా ఉంది. మొన్న మీరు విశాఖపట్నం నిరసనకు పిలుపునిస్తే.. మిమ్మల్ని నమ్మి నాతో సహా చాలామంది వెళ్లాం. మీ పిలుపుకు భయపడి ఏపీలోని ప్రతి ప్రాంతంలోనూ మీ అభిమానుల్ని విశాఖకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుంది. మీరు మొన్న మాట్లాడుతూ ఫిరంగులకు గుండెలు పెట్టేవాళ్లు కావాలి అన్నారు. నిజానికి అలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. మీరు పిలుపునిస్తే పోరాడతారు. నేను కూడా ఉడతా భక్తిగా సాయం చేస్తా. మీ అందరికీ ఎన్నికలే లక్ష్యం. ఐతే ముందు ప్రజల కోసం కూడా రోడ్డు మీదికి వచ్చి పోరాడండి. స్టేట్మెంట్లతో ఆగిపోకండి. పోరాడదాం రండి. మీకు చెప్పేంతటి వాడిని కాకపోవచ్చు. కానీ చెబుతున్నా’’ అని తమ్మారెడ్డి అన్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/