Begin typing your search above and press return to search.

వైఎస్ ఆర్ మిస్సింగ్ పై సినిమా!

By:  Tupaki Desk   |   16 July 2018 4:41 AM GMT
వైఎస్ ఆర్ మిస్సింగ్ పై సినిమా!
X
వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన మహానేత.. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. తన ప్రజాకర్షక పథకాలతో రెండోసారి 2009లో కూడా అధికారం నిలబెట్టుకున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తిరుపతి జిల్లాకు వెళుతుండగా హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ హెలిక్యాప్టర్ మిస్సింగ్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. వాయుసేన రంగంలోకి దిగి ఆచూకీ కోసం వెతికింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమైన హెలిక్యాప్టర్ ప్రమాదం నేపథ్యంలో తమిళంలో ఒక చిత్రం తెరకెక్కుతోంది. కోలీవుడ్ యువ హీరో కృష్ణ - తెలుగు హీరోయిన్ బిందుమాధవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కళుగు2’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.. కృష్ణ కెరీర్ లో ఇప్పటికే ‘కళుగు’ సినిమా సూపర్ హిట్. దానికి సీక్వెల్ గా ఈ మూవీని తీస్తున్నారు. సత్యశివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

కథ విషయానికి వస్తే.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న హెలిక్యాప్టర్.. ప్రమాదంలో చిక్కుకొని అటవీ ప్రాంతంలో కూలిపోతుంది. నేలకొరిగిన హెలిక్యాప్టర్ ను - ముఖ్యమంత్రిని వెతికేందుకు సైనికులు రంగంలోకి దిగుతారు. ఆ ప్రాంతం ప్రజల సహకారంతో అటవీ ప్రాంతం మొత్తం గాలిస్తారు. అయితే అడవిలో వేటకుక్కలు అధికంగా ఉండడంతో వాటిని పట్టుకునే హీరో పాత్రలో కృష్ణ సాయం తీసుకుంటారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ఆచూకీ కనుగొన్నారా లేదా అన్నది కథ..

ఇప్పటికే వైఎస్ జీవితం ఆధారంగా తెలుగులో ‘యాత్ర’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. వైఎస్ పాదయాత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు మరో సినిమా కూడా వైఎస్ మృతి నేపథ్యంలో వస్తుండడంతో ఆసక్తి నెలకొంది.