Begin typing your search above and press return to search.

నాకే పాఠాలు నేర్పించారు-సురేష్ బాబు

By:  Tupaki Desk   |   21 Jun 2018 1:30 AM GMT
నాకే పాఠాలు నేర్పించారు-సురేష్ బాబు
X
తెలుగులో ఒకప్పుడు సినీ పరిశ్రమను ఏలిన ఎన్నో పెద్ద బేనర్లు కనుమరుగైపోయాయి. చాలామంది అగ్ర నిర్మాతలు సినిమాలు మానేసి సైలెంటైపోయారు. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీయలేక.. జడ్జిమెంట్ తేడా కొట్టి వాళ్లందరూ సినిమాలు ఆపేశారు. ఐతే నిన్నటి తరానికి చాలా కొద్ది మంది మాత్రమే ఇప్పటికీ ఉనికి చాటుకుంటున్నారు. ట్రెండీగా సినిమాలు తీయగలుగుతున్నారు. ఈ తరం హీరోలు, టెక్నీషియన్లతో కలిసి సినిమాలు చేయగలుగుతున్నారు. అందులో సురేష్ బాబు ఒకరు. ఆయన యంగ్ టాలెంటుని గుర్తించి.. చక్కటి అభిరుచితో సినిమాలు తీస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘పెళ్ళిచూపులు’ లాంటి సినిమాను గుర్తించి.. దాన్ని ప్రమోట్ చేసి.. తన బేనర్ మీద రిలీజ్ చేసి అద్భుత ఫలితాన్నందుకున్నారాయన. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండో సినిమాను స్వయంగా నిర్మించారు. అదే.. ఈ నగరానికి ఏమైంది?

ఈ సినిమా చేస్తుండగా.. చిత్ర బృందం నుంచి తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు సురేష్ బాబు చెప్పడం విశేషం. తరుణ్ భాస్కర్ కథ చెప్పే విధానమే చాలా కొత్తగా ఉంటుందని.. అది తననెంతో ఆశ్చర్యపరిచిందని సురేష్ చెప్పాడు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లో పది మంది కూర్చున్నారని.. ఒక్కొక్కరు ఒక్కో సీన్.. ఒక్కో డైలాగ్ మార్చి మార్చి చెప్పారని.. దాన్ని క్యాచ్ చేసి అర్థం చేసుకోవడం కష్టమైందని.. ఇది తనకు కొత్త అనుభూతిని పంచిందని ఆయన చెప్పారు. తరుణ్ మీద నమ్మకంతో తాను పెద్దగా షూటింగుకి వెళ్లలేదని.. ఒక రోజు పబ్ లో షూటింగ్ జరుగుతుండగా వెళ్తే.. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ లో సింక్ సౌండ్ తో షూట్ చేయడం చూసి ఆశ్చర్యపోయానని సురేష్ తెలిపాడు. కొన్ని దశాబ్దాల కిందటే ఇండస్ట్రీలో సింక్ సౌండ్ ఉందని.. ఐతే ఇలాంటి మంచి పద్ధతుల్ని వదిలేసి.. సౌకర్యవంతమైన మార్గాల్ని ఫిలిం మేకర్స్ అలవాటు చేసుకున్నారని.. ఐతే ఈ తరం దర్శకుడైన తరుణ్ దీన్ని పర్ఫెక్టుగా ఉపయోగించుకోవడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని.. ఈ చిత్ర బృందం తన లాంటి అనుభవజ్ఞుడికి ఎన్నో పాఠాలు నేర్పిందని ఆయ అన్నారు.