Begin typing your search above and press return to search.

బీజేపీ తీరుపై మండిపడ్డ సురేష్ బాబు

By:  Tupaki Desk   |   21 Oct 2017 10:08 AM GMT
బీజేపీ తీరుపై మండిపడ్డ సురేష్ బాబు
X
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘మెర్శల్’ ఓ అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో హీరో విజయ్ జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పేల్చడం భారతీయ జనతా పార్టీకి ఆగ్రహం తెప్పించింది. ఆ డైలాగులు తొలగించాలని డిమాండ్లు రావడం.. చిత్ర బృందం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డైలాగులు తొలగించేందుకు సిద్ధమవడంతో ఇష్యూ జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. నేషనల్ ఛానెళ్లు ఈ వ్యవహారంపై చర్చా కార్యక్రమాలు మొదలుపెట్టేశాయి. దీన్ని పెద్ద వివాదంగా మారుస్తున్నాయి. ఆల్రెడీ కమల్ హాసన్ దీనిపై మండిపడ్డారు. ఒక సినిమా సెన్సార్ అయ్యాక మళ్లీ ఇలా కట్స్ ఏంటని ప్రశ్నించారు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు భంగం కలిగించే విషయమన్నారు.

తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు ఈ వివాదంపై స్పందించారు. భాజపా తీరును ఆయన తప్పుబట్టారు. ‘‘ప్రభుత్వాల్ని విమర్శించే సినిమాలు వందల్లో వస్తుంటాయి. మరి అన్నింటికీ ఇలాగే చేస్తారా? మెర్శల్ సినిమాను సెన్సార్ బోర్డు పాస్ చేసింది. సినిమా విషయంలో ఏదైనా సమస్య ఉంటే సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్లాలి. రాజకీయ పార్టీలు పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేయడం మామూలే. కానీ ‘మెర్శల్’ సినిమాకు సంబంధించిన వివాదం వల్ల వారికి నెగెటివ్ పబ్లిసిటీనే వచ్చింది. ఆ పార్టీ ఎందుకు ఇలా అతిగా స్పందిస్తోందో అర్థం కావడం లేదు. వాళ్లు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇప్పటికే వారి తీరు తప్పని తేలిపోయింది. ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నారు’’ అని ఓ ప్రముఖ నేషనల్ ఛానెల్‌ తో మాట్లాడుతూ సురేష్ బాబు అన్నారు.