Begin typing your search above and press return to search.

తమిళ ‘బాహుబలి’కి బ్రేక్ పడిపోయిందే...

By:  Tupaki Desk   |   25 Sep 2017 10:16 AM GMT
తమిళ ‘బాహుబలి’కి బ్రేక్ పడిపోయిందే...
X
సంఘమిత్ర.. తమిళ ఇండస్ట్రీకి ‘బాహుబలి’ అవుతుందని అంచనా వేసిన సినిమా. ‘బాహుబలి’ లాగే భారీ బడ్జెట్ తో.. చారిత్రక నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేశాడు సీనియర్ దర్శకుడు సుందర్. దాదాపు మూడేళ్ల కిందట్నుంచి అతను ఈ సినిమా కోసం పని చేస్తున్నాడు. ఈ ఏడాదే ఆ సినిమాకు ప్రారంభోత్సవం కూడా జరిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ తెండ్రాల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. జయం రవి.. ఆర్య.. శ్రుతి హాసన్ లను ప్రధాన తారాగణంగా ఎంచుకున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేసి హడావుడి చేశారు.

కానీ హీరోయిన్ శ్రుతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. శ్రుతి టాటా చెప్పేసి ఐదారు నెలలవుతున్నా ఇప్పటిదాకా ఆమెకు రీప్లేస్మెంట్ ప్రకటించలేదు. సినిమా షూటింగ్ గురించి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడా సందేహాల్ని నిజం చేస్తూ సుందర్ భార్య ఖుష్బూ ఓ ప్రకటన చేసింది. ‘సంఘమిత్ర’ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ఆమె ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల ‘సంఘమిత్ర’ ఆలస్యమవుతోందని.. కాబట్టి సుందర్ వేరే ప్రాజెక్టు మీదికి వెళ్తున్నాడని ఆమె చెప్పింది. తాను తీసిన సూపర్ హిట్ కామెడీ మూవీ ‘కలగలపు’కు సుందర్ సీక్వల్ చేస్తున్నాడని.. అదయ్యాక మళ్లీ ‘సంఘమిత్ర’ను మొదలుపెడతాడని ఖుష్బూ ప్రకటించింది. ‘కలగలపు’ తెలుగులోకి ‘జంప్ జిలాని’ పేరుతో రీమేక్ అయింది. మరి ఈ సినిమా అయ్యాక అయినా ‘సంఘమిత్ర’ను ముందుకు తీసుకెళ్తాడా లేక అది అలాగే ఆగిపోతుందా అన్నది చూడాలి.