Begin typing your search above and press return to search.

సమ్మర్ రేసులోకి ఇంకో మూడు సినిమాలు

By:  Tupaki Desk   |   18 March 2018 7:19 AM GMT
సమ్మర్ రేసులోకి ఇంకో మూడు సినిమాలు
X
ఈసారి వేసవి సినిమాల వేడి మామూలుగా ఉండబోదన్నది ఎప్పుడో తేలిపోయింది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీగా సినిమాల తాకిడి ఉండబోతోంది. ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’.. ‘కబాలి’.. ‘నా పేరు సూర్య’ లాంటి భారీ సినిమాలకు తోడు అనేక మీడియం రేంజి సినిమాలు సమ్మర్ రేసులో ఉన్నాయి. ఇప్పటికే ప్రతి వారానికి సమ్మర్ బెర్తులన్నీ బుక్ అయిపోయి ఉండగా.. ఇప్పుడు కొత్తగా మరిన్ని సినిమాలు రేసులోకి వచ్చాయి. మేలో ఇప్పటికే సినిమాల తాకిడి ఎక్కువ కాబోతోందని అనుకుంటుంటే.. కొత్తగా ఒక్క రోజులో మూడు కొత్త సినిమాల రిలీజ్ డేట్లు ఖరారయ్యాయి. ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్న సినిమాలకు ఇవి పోటీగా రాబోతున్నాయి.

మే తొలి వారంలో ‘నా పేరు సూర్య’ రాబోతుండగా.. తర్వాతి వారానికి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘సాక్ష్యం’ షెడ్యూల్ అయి ఉన్న సంగతి తెలిసిందే. ఆ వారంలోనే ఇంకో రెండు సినిమాలు రాబోతుండటం విశేషం. ఈ ఏడాది తెలుగులో రాబోతున్న స్పెషల్ మూవీస్‌ లో ఒకటైన ‘మహానటి’ని మే 9న విడుదల చేయబోతున్నట్లు ఉగాది సందర్భంగా ప్రకటించారు. ఈ రోజే టీజర్ లాంచ్ అయిన ‘రాజు గాడు’ను మే 11న రిలీజ్ చేస్తారట. మరోవైపు ఉగాది కానుకగా ‘నేల టిక్కెట్టు’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదే రోజుకు నాగార్జున-రామ్ గోపాల్ వర్మల ‘ఆఫీసర్’ విడుదల ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. మే నెల మొత్తంలో ఏడెనిమిది దాకా పేరున్న సినిమాలే రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.