Begin typing your search above and press return to search.

కీర్తితో విడాకులు.. ఎందుకో చెప్పాడు

By:  Tupaki Desk   |   17 Dec 2017 1:36 PM GMT
కీర్తితో విడాకులు.. ఎందుకో చెప్పాడు
X
‘తొలి ప్రేమ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన తెలుగమ్మాయి కీర్తి రెడ్డికి.. నాగార్జున మేనల్లుడు సుమంత్ కు పెళ్లి జరిగినపుడు వీళ్ల జంట చూడముచ్చటగా అనిపించింది. నాగార్జున-అమల లాగా ఇది మరో మంచి జంట అవుతుందని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా రెండేళ్లు తిరిగేసరికే వీళ్ల జంట విడిపోయింది. విడాకులు తీసుకుంది. ఐతే సుమంత్-కీర్తి విడిపోవడానికి సరైన కారణాలేంటన్నది ఇప్పటి వరకు తెలియలేదు. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు సుమంత్. తమ బంధం ఏడాదిన్నర మాత్రమే నిలిచిందని.. ఆ ఏడాదిన్నరలో తమ ఇద్దరి వ్యక్తిత్వాలు.. జీవితాలు పూర్తి భిన్నమని తమకు అర్థమైందని సుమంత్ తెలిపాడు.

తామిద్దరం ఎంతో కాలం కలిసి ఉండలేమని తమకు అర్థం కావడంతో ఉమ్మడి అంగీకారంతో.. సుహృద్భావ వాతావరణంలో విడిపోవడానికి నిర్ణయించుకున్నామని సుమంత్ తెలిపాడు. కీర్తి తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉందని.. అది తనకు కూడా ఆనందాన్నిచ్చే విషయమని సుమంత్ తెలిపాడు. కీర్తితో తాను ఇప్పటికీ టచ్ లో ఉన్నానని.. అప్పుడప్పుడూ ఫోన్లో కూడా మాట్లాడుతుంటానని.. కీర్తి కుటుంబం తననెంతగానో గౌరవిస్తుందని సుమంత్ తెలిపాడు. చివరగా తన తాత ఏఎన్నార్ చనిపోయినపుడు కీర్తి ఇక్కడికి వచ్చి వెళ్లిందని సుమంత్ తెలిపాడు. తన విడాకుల విషయంలో తన మావయ్య నాగార్జున పాత్ర ఉన్నట్లు వచ్చిన ఊహాగానాల్ని అతను కొట్టిపారేశాడు.