Begin typing your search above and press return to search.

శివాజీ రాజా చెప్పుతో కొడతానన్నది ఎవర్ని?

By:  Tupaki Desk   |   25 March 2017 10:28 AM GMT
శివాజీ రాజా చెప్పుతో కొడతానన్నది ఎవర్ని?
X
టీవీ రంగంలో రాణించి.. సినిమాల్లోనూ ఓ మోస్తరు స్థాయి పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు శివాజీ రాజా. సినీ రంగంలో ఓ దశ దాటి ఎదగలేకపోయినప్పటికీ ఆయనకు ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలేకేమీ లోటు లేదు. రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ కార్యవర్గంలో కీలక పాత్ర పోషించి.. ఇటీవలే ‘మా’ అధ్యక్షుడిగానూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు శివాజీ రాజా. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన శివాజీ రాజా.. అందులో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓ సందర్భంలో ఓ పెద్ద నటుడిని చెప్పుతో కొడతానని హెచ్చరించినట్లుగా శివాజీ రాజా వెల్లడించాడు. అతనా మాట ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసుకుందాం పదండి.

‘‘సీనియర్ నటుడు రంగనాథ్ గారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన చాలా బాధపడ్డారు. అలాంటిది చివరికి ఆయనే ఆత్మహత్య చేసుకోవడం నన్ను కలచి వేసింది. ఆయన మరణవార్త తెలియగానే ఇంటికి వెళ్లాను. నాతో పాటు చిరంజీవిగారు కూడా వచ్చారు. ఐతే రంగనాథ్ గారి ఇల్లు చాలా దూరం కావడంతో ఇండస్ట్రీ వాళ్లు అందరూ రాలేదన్న ఉద్దేశంతో ఆయన పార్థివ దేహాన్ని మా కార్యాలయానికి తీసుకొచ్చి పెట్టాం. ఐతే అక్కడికి వచ్చిన ఓ పెద్ద నటుడు ఈయన శవం ఎందుకు ఇక్కడ పెట్టారు అని కోపంగా అన్నాడు. నాకు కోపం నషాళానికి అంటి.. ‘ఏంట్రా అన్నావు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా’ అని హెచ్చరించా. ఇండస్ట్రీలో ఆయన చాలా పెద్ద స్థాయి వ్యక్తే. కానీ సంస్కారంలో నా కాలి గోటికి కూడా సరిపోడు’’ అన్నాడు శివాజీ రాజా. తాను రంగనాథ్ దర్శకత్వం వహించిన ‘మొగుడ్స్ పెళ్లామ్స్’లో హీరోగా నటించాను కాబట్టే ఆయన పార్థివ దేహాన్ని మా కార్యాలయంలో పెట్టించానని ఆ వ్యక్తి అనుకున్నాడని.. కానీ అది వాస్తవం కాదని.. అంతకుముందు కూడా చాలామంది పెద్ద ఆర్టిస్టులు చనిపోయినపుడు ఇక్కడికి తీసుకొచ్చామని శివాజీ రాజా వివరించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/