Begin typing your search above and press return to search.

సీతారామశాస్త్రి ‘శాతకర్ణి’ చూసి..

By:  Tupaki Desk   |   23 Jan 2017 6:28 AM GMT
సీతారామశాస్త్రి ‘శాతకర్ణి’ చూసి..
X
సాయిమాధవ్ బుర్రా.. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈయన గురించే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణల కెరీర్లలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలు రెండింటికీ ఆయనే మాటలు రాశారు. అవి రెండూ ఒకేసారి విడుదలయ్యాయి. అద్భుత విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాల్లోనూ మాటల విషయమై ప్రశంసల వర్షం కురుస్తోంది. దాదాపు పది రోజుల నుంచి తన ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉందని.. ఎందరెందరో ఫోన్ చేసి తనను పొగిడేస్తున్నారని పొంగిపోయాడు సాయిమాధవ్. ఇంతకీ అన్ని ప్రశంసల్లోకి గొప్పది ఏది అని సాయిమాధవ్ ను అడిగితే అతనేమని సమాధానం ఇచ్చాడంటే..

‘‘గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి సీతారామశాస్త్రి గారి ప్రశంసల్ని ఎప్పటికీ మరిచిపోలేను. మేమిద్దరం కలిసి విడుదలకు ముందే ముంబయిలో ప్రివ్యూ చూశాం. అక్కడి నుంచి ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చాం. అక్కడ ఆయన నన్ను ఒకసారి దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నారు. తర్వాత భుజం తట్టారు. ఇక పద అన్నారు. అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నన్ను హత్తుకునేటపుడు ఆయన కళ్లల్లో ఒక మెరుపు చూశాను. అది చాలు ఈ జీవితానికి అనిపించింది. ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్దాయన చాలా ఎమోషనల్ గా మాట్లాడటాన్ని కూడా మరిచిపోలేను. ఇక ‘ఖైదీ నెంబర్ 150’కి సంబంధించి కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. ఒక కొత్త వ్యక్తి నాకు ఫోన్ చేశారు. తన మనవడి నుంచి నంబర్ తీసుకున్నట్లు చెప్పాడు. అతను ఎక్కడెక్కడో ప్రయత్నించి నా నంబంర్ సంపాదించాడట. ఈ సినిమాలో రైతుల కష్టాల గురించి రాసిన డైలాగులకు కదిలిపోయానంటూ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు ఆయన. ఆ మాటలు కూడా ఎప్పటికీ గుర్తుంటాయి’’ అని సాయిమాధవ్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/