Begin typing your search above and press return to search.

మాట మార్చేసిన షారుఖ్ ఖాన్

By:  Tupaki Desk   |   24 Nov 2015 6:43 AM GMT
మాట మార్చేసిన షారుఖ్ ఖాన్
X
షారుఖ్ ఖాన్ మాటకారి. ఎప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలా వివాదాలు రాజేయాలో.. వాటి ద్వారా ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలో అతడికి బాగా తెలుసు. మత అసహనం గురించి ఆ మధ్య అతను చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే. ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా మత అసహనం గురించి మాట్లాడాడు. ఐతే ఎవరు ఏమనుకుంటారన్నది పట్టించుకోకుండా అమీర్ తన అభిప్రాయం గురించి చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. ఐతే షారుఖ్ అలాంటి వాడు కాదు. అతను ఏం మాట్లాడినా ఓ స్ట్రాటజీ ఉంటుంది. ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా ప్రచారం కోసం అప్పట్లో తానో ముస్లిం అన్న కారణంతో అమెరికన్ అధికారులు సోదాలు చేశారంటూ ఎంత హడావుడి చేశాడో గుర్తుండే ఉంటుంది. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు షారుఖ్ కి మామూలే.

తాజాగా మత అసహనం మీద షారుఖ్ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఐతే వీటి వల్ల వచ్చిన పబ్లిసిటీ కంటే వ్యతిరేకతే ఎక్కువ కావడంతో షారుఖ్ ఇప్పుడు మాట మార్చేస్తున్నాడు. తాను ఇండియాలో మత అసహనం ఎక్కువ అని ఎప్పుడూ అనలేదని.. తన ఉద్దేశం అది కాదని అంటున్నాడు షారుఖ్. ప్రస్తుతం యువత దేశాన్ని లౌకికంగా మార్చడానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నించాలని.. జనాలు తామేం నమ్ముతారో దాని మీద నమ్మకం పెట్టుకోవాలని.. ఇలా సంబంధం లేని మాటలు మాట్లాడాడు షారుఖ్. ఐతే అప్పట్లో ఓ ఇంటర్వ్యూ లో ఇండియాలో అసహనం పతాక స్థాయికి చేరిందని షారుఖ్ అన్న మాట వాస్తవం. తనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా వెనక్కి ఇచ్చేయాలనుకుంటున్నట్లు షారుఖ్ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై భాజపా నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షారుఖ్ పాకిస్థాన్ ఏజెంట్ అని.. అతణ్ని ఆ దేశానికే పంపించేయాలని వ్యాఖ్యలు చేశారు.