Begin typing your search above and press return to search.

సీక్వెళ్ల సంవత్సరం 2017

By:  Tupaki Desk   |   19 Jan 2017 11:30 AM GMT
సీక్వెళ్ల సంవత్సరం 2017
X
హాలీవుడ్ ట్రెండ్ అయిన సీక్వెళ్లు ఇప్పుడు ఇండియన్ సినిమాలోనూ పెరుగుతున్నాయి. తెలుగు - తమిళ - హిందీ భాషలలో భారీ అంచనాల మధ్య రూపొందిన పలు చిత్రాలకు ఈ ఏడాది సీక్వెళ్లు రానున్నాయి. ముఖ్యంగా తెలుగులో బాహుబలి- 2 - రాజుగారిగది-2 చిత్రాలు ఇప్పటికే ఆసక్తి రేపుతున్నాయి.

ప్రభాస్‌ కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు. దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న బాహుబలి-2 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రం కూడా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్న విషయం వేచిచూడాల్సిందే. ఇక ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నటీనటులతో ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందిన రాజుగారిగది చిత్రం ఓ పెద్ద చిత్రం స్థాయిలో కలెక్షన్లను వసూలుచేసింది. దాంతో దానికి సీక్వెల్‌ తీస్తే బావుంటుందని భావించి, రాజుగారిగది-2కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో నాగార్జున లాంటి పెద్ద స్టార్‌ నటిస్తుండటంతో ఈ సినిమాకు మరింత హైప్‌ వచ్చింది. వరుస విజయాలతో ఉన్న నాగార్జునకు ఈ సీక్వెల్‌ కథ ఎంతగానో నచ్చి, ఈ చిత్రం చేసేందుకు అంగీకరించారు. నాగార్జున లాంటి పెద్దస్టార్‌ నటిస్తుండటంతో సినిమాను ఓంకార్‌ ఛాలెంజింగ్‌ గా తీసుకున్నారట.

ఇక తెలుగు ఆడియన్సుతో విడదీయలేని అనుబంధం పెంచుకుంటున్న తమిళ సినీరంగం నుంచి కూడా సీక్వెళ్లు వస్తున్నాయి. ఇప్పటికే సూర్య కథానాయకుడిగా కోలీవుడ్‌ లో రూపొందిన సింగం సిరీస్‌ రెండు చిత్రాలు అక్కడే కాదు టాలీవుడ్‌ లో కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సూర్య సింగం-3గా వచ్చేస్తున్నాడు. రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రం ప్రేక్షకులను అమితంగా అలరించిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది.

వీటితో పాటు కమల్‌ హాసన్‌ నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన విశ్వరూపం-2 విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. గత ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆశించారు. అయితే ఈ నూతన ఏడాదిలో దీనికి విడుదల పరంగా మోక్షం కలుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ శభాష్‌ నాయుడు చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ మధ్య చెన్నైలోని కార్యాలయంలో మెట్లు దిగుతుండగా జారిపడిపోవడంతో కమల్‌ కాలికి గాయాలైన విషయం తెలిసిందే. శభాష్‌ నాయుడు చిత్రం విడుదల తర్వాతే విశ్వరూపం-2 చిత్రం విడుదల కావచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ధనుష్‌ నటించిన వి.ఐ.పి. చిత్రం అటు తమిళంలో - ఇటు తెలుగులో యూత్‌ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు దానికి సీక్వెల్‌ గా వి.ఐ.పి-2 రాబోతోంది. సౌందర్యరజనీకాంత్‌ దర్శకత్వంలో రూపొం దుతున్న ఈ చిత్రంపైనా భారీ అంచనాలు ఉన్నాయి.

బాలీవుడ్‌ కూడా సీక్వెళ్లతో హడావుడిగా ఉంది. హెరాపేరి చిత్రాల సిరీస్‌ లో ఇంతవరకు రెండు చిత్రాలు రాగా ఇప్పుడు హెరాపేరి-3 చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అభిషేక్‌ బచ్చన్‌ తో పాటు పరేష్‌ రావల్‌ - సునీల్‌ శెట్టి తదితరులు ప్రధాన తారాగణం. ఇదిలావుండగా అమితాబ్‌ బచ్చన్‌ - దర్శకుడు రాంగోపాల్‌ వర్మల కలయికలో లోగడ వచ్చిన సర్కార్‌ రెండు చిత్రాలు విజయవంతం కావడంతో తాజాగా దానికి సీక్వెల్‌ గా సర్కార్‌-3 చిత్రం రాబోతోంది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి17న ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. సో.. సీక్వెళ్ల సందడిలో మునిగిపోవడానికి ప్రేక్షకులు రెడీ అయిపోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/