Begin typing your search above and press return to search.

సావిత్రి గురించి కూతురు చెప్పిన నిజాలు

By:  Tupaki Desk   |   15 Aug 2017 10:16 AM GMT
సావిత్రి గురించి కూతురు చెప్పిన నిజాలు
X
ఆ మధ్య మహానటి సావిత్రి చివరి రోజుల నాటిదంటూ ఒక ఫొటో బయటికి వచ్చింది. అందులో బక్క చిక్కిన శరీరంతో అసలు పోల్చుకోలేని స్థితిలి కనిపించారు సావిత్రి. ఈ ఫొటోను చూపిస్తూ చివరి రోజుల్లో ఆర్థికంగా ఆమె చితికిపోయారని.. దయనీయ స్థితిలో ఆమె చివరి రోజులు గడిచాయని.. వైద్యం చేయించుకోలేని స్థితిలో తుది శ్వాస విడిచారని.. ఇలా రకరకాల కథనాలు వినిపించాయి. ఐతే ఈ ప్రచారం ఉత్త అబద్ధమని అంటోంది సావిత్రి తనయురాలు విజయ చాముండేశ్వరి. తన తల్లి ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బంది పడలేదని.. ఆమె దర్జాగా బతికారని.. తమకు కూడా కావాల్సినంత ఆస్తి ఇచ్చారని ఆమె చెప్పింది.

తన తల్లి ఒక సమయంలో సరైన సినిమాలు చేయకపోవడం వల్ల ఆమె కెరీర్ దెబ్బ తిందని.. ఆ క్రమంలో ఆమె మద్యానికి బానిస అయ్యారని.. తర్వాత మధుమేహం ఆమెను కుంగదీసిందని విజయ చాముండేశ్వరి చెప్పారు. సావిత్రి 19 నెలల పాటు కోమాలో ఉండటం వల్ల చిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారని.. ఆ సమయంలో తన తండ్రి జెమిని గణేషన్ పట్టించుకోలేదన్న ప్రచారం కూడా అవాస్తవమని.. ఆయన తన తల్లిని బాగా చూసుకున్నారని.. సావిత్రితో విభేదాలున్న మరో అగ్ర నటుడు శివాజీ గణేషన్ కూడా తన పరిస్థితి చూసి చాలా బాధపడ్డారని ఆమె తెలిపారు. తన తల్లి డబ్బులు పోగొట్టుకున్నప్పటికీ.. అంతకు రెట్టింపు సంపాదించిందని.. తాము ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉండటానికి తల్లే కారణమని.. తమ తర్వాత ఇంకో రెండు తరాలు సంతోషంగా బతికేంత ఆస్తి తమకుందని విజయ చాముండేశ్వరి చెప్పడం విశేషం. సావిత్రి జీవిత కథతో తెరకెక్కతున్న సినిమాలో వాస్తవాలే చూపిస్తారని ఆశిస్తున్నానని.. ఈ సినిమా స్క్రిప్టును తాము ఓకే చేశాకే షూట్ చేయాలని షరతు పెట్టగా.. అందుకు యూనిట్ సభ్యులు అంగీకరించారని ఆమె చెప్పారు.