Begin typing your search above and press return to search.

'సర్కార్‌' వివాదం..విజయ్‌ ఫ్యాన్‌ ఆజ్యం పోశాడు

By:  Tupaki Desk   |   9 Nov 2018 1:03 PM GMT
సర్కార్‌ వివాదం..విజయ్‌ ఫ్యాన్‌ ఆజ్యం పోశాడు
X
తమిళనాట తాజాగా విడుదలైన ‘సర్కార్‌’ చిత్ర వివాదం పెద్ద ఎత్తున నడుస్తున్న విషయం తెల్సిందే. అధికార అన్నాడీఎంకే పార్టీ నాయకులు ‘సర్కార్‌’ చిత్ర ప్రధర్శణను అడ్డుకోవాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన విషయం అవ్వడంతో ఈ వివాదం మరింతగా ముదురుతూనే ఉంది. జయలలితను అవమానిస్తూ - ఆమెను చెడుగా చూపించాడు అంటూ మురుగదాస్‌ పై ఇప్పటికే అన్నాడీఎంకే కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు అంటూ సమాచారం అందుతుంది. మరో వైపు మురుగదాస్‌ ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అందుకే మురుగ ముందస్తు బెయిల్‌ కు కూడా అప్లై చేశాడని అంటున్నారు.

ఇలాంటి సమయంలో విజయ్‌ కి వీరాభిమానిని అంటూ చెప్పుకుంటున్న వ్యక్తి చేసిన పని అక్కడ మరింత వివాదాన్ని రేపుతోంది. సినిమాలో ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన వస్తువులను మంటల్లో వేయండి అనే డైలాగ్‌ ఉంది. ఇప్పుడు అదే పద్దతిన తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌ ట్యాప్‌ ను ఆ వ్యక్తి గోడకేసి బాది - పగులకొట్టి మరీ వివాదాన్ని పెద్దది చేశాడు. ఈ వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని కొందరు ప్రయత్నిస్తుంటే ఆ అభిమాని చేసిన పనితో వివాదం మరింత పెద్దది అవ్వనుందని తమిళ సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

మరోవైపు విజయ్‌ అభిమాని చేసిన పని తీవ్ర దుమారంను రేపుతోంది. అతడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని కూడా కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వస్తువును పగుల కొట్టడంతో పాటు - ప్రభుత్వంకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు అంటూ అన్నాడీఎంకే నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాప్‌ టాప్‌ ఇష్టం లేకుంటే ప్రభుత్వంకు తిరిగి ఇచ్చేస్తే ఎంతో మంది విద్యార్థులు ల్యాప్‌ టాప్‌ లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి అది చేరేది కదా అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఒక వైపు విజయ్‌, మురుగదాస్‌ అభిమానులు మరో వైపు అన్నాడీఎంకే కార్యకర్తలు సోషల్‌ మీడియాలో మాటల యుద్దం చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు అనిపిస్తోంది.