Begin typing your search above and press return to search.

నడిగర్ వేడి... విశాల్ పై కేసు

By:  Tupaki Desk   |   10 Oct 2015 6:29 AM GMT
నడిగర్ వేడి... విశాల్ పై కేసు
X
నడిగర్ సంఘం ఎన్నికలు తమిళనాడులోనే కాకుండా దక్షిణభారత దేశంలోనే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చెన్నైలో రోజుకో గ్రూపు మీడియా సమావేశం పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కేసులు కూడా పెట్టుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు శరత్‌కుమార్ హీరో విశాల్‌ పై శుక్రవారం క్రిమినల్ కేసు దాఖలు చేశారు. తానూ కేసు పెట్టబోతున్నట్లు విశాల్ ప్రకటించారు.

నడిగర్ సంఘం(దక్షిణ భారత నటీనటుల సంఘం) ఈ నెల 18న జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో శరత్‌ కుమార్, విశాల్ ప్యానళ్లు బరిలో ఉన్నాయి. గత టెర్ములో శరత్‌ కుమార్ ప్యానల్ విజయం సాధించగా ఈసారి విశాల్ ప్యానల్ పోటీకి దిగింది. ఒకరకంగా గట్టి పోటీనే ఇస్తోంది. విజయం కోసం రెండు ప్యానళ్లూ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటూ ఆరోపణల పర్వానికి దిగుతున్నాయి. రెండు రోజుల క్రితం శరత్‌ కుమార్ మద్దతుదారులు నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు శింబు చేసిన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. సామరస్యంగా ఉందామంటూ శరత్‌ కుమార్ చేసిన ప్రకటనను విశాల్ ప్యానల్ స్వీకరించలేదు. పోటీకి వెళ్లడం ఖాయమని తేల్చేశారు. ఇదిలా ఉండగా, ఎన్నికల తేదీ వెలువడిన నాటి నుంచి విశాల్ తనపై అవినీతి, అక్రమాలు అంటూ అనేక ఆరోపణలలో పరువునష్టం కలిగించాడని ఆరోపిస్తూ శరత్‌ కుమార్ శుక్రవారం ఎగ్మూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ సమాచారం అందుకున్న విశాల్ తీవ్రంగా స్పందిస్తూ తాను కూడా త్వరలో శరత్‌ కుమార్‌ పై కేసును పెడతానని ప్రకటించారు.

కాగా అంతకుముందు విశాల్ ను శరత్ కుమార్ భార్య రాధిక కడిగిపారేసింది. ''తమ్ముడూ...!! విశాల్.. నువ్వేమైనా రజనీకాంత్ వా, లేదంటే కమల్ హాసన్ వా..? విజయ్ వా... అజిత్ వా .. రూ.30 కోట్లు సమీకరిస్తానని హడావుడి చేస్తున్నావ్... నీకంత సీన్ లేదులే'' అంటూ గాలి తీసేశారు. నీకొత్త సినిమా కలెక్షన్ తమిళనాడు అంతా కలిపినా 5 కోట్లు దాటలేదు నువ్వు 30 కోట్లు నడిగర్ సంఘం కోసం కలెక్ట్ చేస్తావా... ఎవరైనా నవ్వుతారు అంటూ ఏకిపారేశారు. నీమాటలు విని జనం నవ్వుతున్నారు అంటూ గాలితీసేశారు. మరోవైపు రాధిక భర్త శరత్ ఇప్పుడు విశాల్ పై కేసు పెట్టారు. దీంతో నడిగర్ సంఘం ఎన్నికలు వేడివేడిగా మారింది.