Begin typing your search above and press return to search.

మోడ్రన్‌ ఏకలవ్యుడు మారాడా?

By:  Tupaki Desk   |   19 Feb 2019 6:23 AM GMT
మోడ్రన్‌ ఏకలవ్యుడు మారాడా?
X
'సుబ్రమణ్యపురం' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సంతోష్‌ జాగర్లమూడి కొన్ని వారాల క్రితం సందీప్‌ కిషన్‌ హీరోగా ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. మహాభారతంలోని ఏకలవ్యుడి కాన్సెప్ట్‌ తో, ఆ తరహా కథను ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా రూపొందించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. త్వరలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటన కూడా వచ్చింది. కాని షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సమయంలోనే సినిమా చేతులు మారిందనే ప్రచారం జరుగుతోంది.

ఈ కథను ఏషియన్‌ సునీల్‌ నిర్మించబోతున్నాడట. ఇక సందీప్‌ కిషన్‌ కాకుండా నాగశౌర్యతో ఈ మూవీ చేసేందుకు సంతోష్‌ సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సందీప్‌ కిషన్‌ కంటే తన కథకు నాగశౌర్య అయితే బాగుంటుందనే అభిప్రాయంతో సంతోష్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. విలువిద్య నేపథ్యంలో మూవీ కనుక మంచి బాడీ అవసరం, ప్రస్తుతం యంగ్‌ హీరోల్లో నాగశౌర్యకు మంచి బాడీ ఉంది. అందుకే నాగశౌర్యను తన సినిమా కోసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరి నిర్మాత ఎందుకు మారాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఏషియన్‌ సునీల్‌ ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్‌ గానే కొనసాగాడు. నిర్మాతగా ఆయన మొదటి సినిమా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రాబోతుంది. ఆ సినిమా ఇంకా చర్చల దశలో ఉండగానే ఏషియన్‌ సునీల్‌ నిర్మాణంలో రెండవ సినిమా దాదాపుగా ఓకే అయ్యింది. త్వరలోనే మూవీపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.