Begin typing your search above and press return to search.

బుక్కు మీద భగ్గుమన్న మున్నాభాయ్

By:  Tupaki Desk   |   21 March 2018 1:03 PM GMT
బుక్కు మీద భగ్గుమన్న మున్నాభాయ్
X
సంజయ్ దత్ కు కోపం వచ్చింది. జైలు నుంచి బయటికి వచ్చాక ప్రశాంత జీవితం గడుపుతూ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటున్న మున్నా భాయ్ కు ఒక రచయిత వల్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతని పేరు యాస్సిర్ ఉస్మాన్. సంజయ్ దత్ జీవిత కథ అంటూ 'ది అన్ టోల్డ్ స్టొరీ అఫ్ బాలీవుడ్ బాడ్ బాయ్' అనే పుస్తకం రాసి విడుదల చేసాడు. దీనికి నిజానికి సంజయ్ అనుమతి లేదు. మాధురి దీక్షిత్ తో ప్రేమాయణం గురించి మొదలుపెట్టి మొదటి భార్య రిచాతో విభేదాలు గురించి అక్రమాయుధాల కేసు వరకు చాలా విషయాలే అందులో రాసాడు. ఇది కాస్త వివాదాలకు దారి తీయడమే కాక అభిమానులతో పాటు సంజయ్ దత్ కుటుంబ సభ్యులకు కూడా మనస్తాపం కలిగించడంతో సంజయ్ దత్ తన తన ట్విట్టర్ లో ఘాటుగా స్పందించాడు.

అసలు తనను అడగకుండా ఈ పుస్తకాన్ని రాసారని, పాత పత్రికల్లోని గాసిప్స్ ని తీసుకుని ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాల ఆధారంగా ఉస్మాన్ ఇష్టం వచ్చినట్టు రాసి పారేసాడని కడిగి పారేసాడు. దీన్ని ఊరికే వదిలే సమస్యే లేదన్న సంజయ్ దత్ లీగల్ చర్యలకు కూడా ఉపక్రమించబోతున్నట్టు వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకు జగర్నాట్ పబ్లికేషన్స్ సంస్థ దిగి వచ్చి క్షమాపణ చెప్పింది కాని అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. సో దత్ ను చట్టప్రకారంగా ఎదుర్కోక తప్పదు. ఈ పుస్తకం బాలీవుడ్ సర్కిల్స్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంకా మాధురి దీక్షిత్ దీనికి స్పందించలేదు. ఇద్దరు కలిసి ఖల్ నాయక్ లో కలిసి నటించడం అభిమానులు ఎన్నటికి మర్చిపోలేరు. ఆ సినిమానే ఇద్దరి కెరీర్ ను మలుపు తిప్పింది . దాని తర్వాత ఆయుధాల కేసులో సంజయ్ ఇరుక్కున్నాడు.

ఇలా అనుమతి లేకుండా బయోపిక్ రాయడం పట్ల బాలీవుడ్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సేల్స్ కోసం పబ్లిసిటీ కోసం సినిమా తారలను వాడుకోవడం మంచిది కాదని చెబుతూ సంజయ్ దత్ లీగల్ యాక్షన్ కు మద్దతు పలుకుతున్నారు. గత ఏడాది సంజయ్ దత్ కం బ్యాక్ మూవీగా నటించిన భూమి డిజాస్టర్ అయ్యింది. సంజయ్ అఫీషియల్ బయోపిక్ రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న సంగతి తెలిసిందే.