Begin typing your search above and press return to search.

ఆ హత్యపై 'అర్జున్‌ రెడ్డి' దర్శకుడు దిగ్బ్రాంతి

By:  Tupaki Desk   |   15 Oct 2019 2:05 PM GMT
ఆ హత్యపై అర్జున్‌ రెడ్డి దర్శకుడు దిగ్బ్రాంతి
X
టిక్‌ టాక్‌ విలన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న జానీ దాదా అలియాస్‌ అశ్వినీ కుమార్‌ హత్యకేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన అశ్వినీ కుమార్‌ కొంత కాలంగా ఒక ప్రముఖ ఎయిర్‌ లైన్స్‌ లో పని చేస్తున్న నికితా శర్మను ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారట. కాని కొన్ని కారణాల వల్ల నికితా శర్మ వచ్చే ఏడాది అశ్వినీ కుమార్‌ ను కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇలాంటి సమయంలో టిక్‌ టాక్‌ ద్వారా అశ్వినీ కుమార్‌ తన లవ్‌ ఫెయిల్యూర్‌ ను తెలియజేసేవాడు.

టిక్‌ టాక్‌ ద్వారా తన లవర్‌ మోసం చేసిందని పలు సార్లు చెప్పిన అశ్వినీ కుమార్‌ కు అర్జున్‌ రెడ్డి సినిమా హిందీ వర్షన్‌ అదేనండి 'కబీర్‌ సింగ్‌' అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతో కబీర్‌ సింగ్‌ లోని చాలా డైలాగ్స్‌ ను టిక్‌ టాక్‌ లో చెప్పాడు. ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న అశ్వినీ కుమార్‌ కబీర్‌ సింగ్‌ లోని ఒక డైలాగ్‌ నుండి ప్రేరణ పొంది తన లవర్‌ నికితా శర్మను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారట.

కబీర్‌ సింగ్‌ లో నాకు దక్కనిది మరెవ్వరికి దక్కవద్దంటూ డైలాగ్‌ ఉంటుంది. ఆ డైలాగ్‌ ను అశ్వినీ కుమార్‌ పలు వీడియోలు చేశాడని పోలీసులు అంటున్నారు. నికితాను చంపేసేందుకు ఆ డైలాగ్‌ ప్రేరణ అయ్యి ఉంటుందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో కబీర్‌ సింగ్‌ చిత్ర దర్శకుడు సందీప్‌ వంగ స్పందించారు.

నా కబీర్‌ సింగ్‌ సినిమాను అమితంగా ప్రేమించే వ్యక్తి ఇలా చేయడం దిగ్బ్రాంతిని కలిగించింది. నికితా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నికితా తన విలువైన జీవితంను పోగొట్టుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. నా సినిమాలు హత్యలను ప్రేరేపించేవిగా ఉండవు. అలాంటి సీన్లు నేనెప్పుడు చేయను. నా వృత్తి పట్ల నాకు సామాజిక స్పృహ ఉంది అంటూ సందీప్‌ వంగ అన్నారు. టిక్‌ టాక్‌ విలన్‌ అశ్వినీ కుమార్‌ చేసిన హత్య విషయమై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన్ను అభిమానించే వారు అతడు హత్య చేసిన విషయం తెలిసి అవాక్కవుతున్నారు.