Begin typing your search above and press return to search.

క్రైమ్ డ్రామా వండుతున్న వంగా

By:  Tupaki Desk   |   11 Sep 2019 7:37 AM GMT
క్రైమ్ డ్రామా వండుతున్న వంగా
X
'అర్జున్ రెడ్డి' సంచలన విజయం సాధించడంతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగా ఆ సినిమా బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్' ఘన విజయం సాధించడంతో బాలీవుడ్ లో కూడా క్రేజీ డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా తర్వాత సందీప్ ఫలానా తెలుగు హీరోతో పని చేస్తాడు అనే విషయంలో కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నప్పటికీ అవేవీ నిజం కాదు. ఎందుకంటే సందీప్ నెక్స్ట్ సినిమా కూడా బాలీవుడ్ లోనే ఉంటుంది.

సందీప్ రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీతో మెప్పించాడట. మొదటి సినిమాకు ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీని ఎంచుకున్న సందీప్ ఈ సినిమాకు ఎలాంటి కథ ఎంచుకున్నాడనేది ఆసక్తికరం. ఈ సారి ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామాను ఎంచుకున్నాడట. సందీప్ చెప్పిన స్టొరీలైన్ నచ్చడంతో రణబీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమా టీసీరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తాడట. అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే రణబీర్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి 'బ్రహ్మాస్త్ర' కాగా మరొకటి 'షంషేరా'. రణబీర్ ఈ రెండు సినిమాలు పూర్తిచేసేలోపు సందీప్ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటాడట.

సందీప్ వంగా ఇంటెన్స్ స్క్రిప్ట్ లే కాకుండా తన కథకు తగ్గ ఇంటెన్స్ యాక్టర్స్ ను ఎంచుకుంటాడు. మొదటి సినిమాతో విజయ్ దేవరకొండకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు సందీప్.ఆ సినిమాను హిందీలో రీమేక్ చేసే సమయంలో షాహిద్ ను ఎంచుకున్నప్పుడు చాలామంది విజయ్ యాక్టింగ్ ను మ్యాచ్ చేయగలడా అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ షాహిద్ ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. అంతే కాదు.. హిందీ ప్రేక్షకులకు తెగ నచ్చడంతో 'కబీర్ సింగ్' ఈ ఈ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక నెక్స్ట్ సినిమా హీరో రణబీర్ కూడా మంచి ప్రతిభ ఉన్న నటుడు. 'సంజు' లో రణబీర్ యాక్టింగ్ కు భారీ ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. సందీప్ - రణబీర్ కాంబో బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.