Begin typing your search above and press return to search.

చిత్రలహరులు వస్తున్నారు

By:  Tupaki Desk   |   12 March 2019 5:36 AM GMT
చిత్రలహరులు వస్తున్నారు
X
రెండేళ్లుగా ఆరు డిజాస్టర్లతో సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా చిత్రలహరి ప్రమోషన్ రేపటి నుంచి సందడి చేయబోతోంది. వచ్చే నెల 12 విడుదల అని గతంలోనే ప్రకటించారు కానీ ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడంతో కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. వాటికి చెక్ పెడుతూ రేపు ఉదయం టీజర్ తో సందడి మొదలుపెట్టబోతున్నారు.

సాయి ధరమ్ తేజ్ తో పాటు హీరోయిన్లు కళ్యాణి ప్రియదర్శన్ నివేతా పేతురాజ్ లుక్స్ తో పాటు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న సునీల్ వెన్నెల కిషోర్ల పిక్స్ ని కూడా జోడించి మైత్రి సంస్థ ఇందాకా ఓ పోస్టర్ విడుదల చేసింది. రేపు చిత్రలహరి పాత్రలను పరిచయం చేయబోతున్నామంటూ హింట్ ఇచ్చేసింది. రంగస్థలం తర్వాత దేవిశ్రీప్రసాద్ మైత్రి సంస్థలో మ్యూజిక్ అందిస్తున్న చిత్రం ఇదే. నేను శైలజతో మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న దర్శకుడు తిరుమల కిషోర్ రెండో మూవీ ఉన్నది ఒకటే జిందగీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే తన ఆశలన్నీ చిత్రలహరి మీదే ఉన్నాయి.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం చిత్రలహరి అనేవి ఇద్దరు హీరోయిన్ల పేర్లట. ఒకరు చిత్ర. మరొకరు లహరి. ఎప్పుడో బాల్యంలో నిన్నటి తరానికి దూరదర్శన్ ఛానల్ లో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉన్న ప్రోగ్రాం పేరుని ఈ సినిమాకు పెట్టడం పట్ల చిత్రలహరి మీద సాధారణ ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి లేకపోలేదు. ఇంకా ఇందులో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో రేపు టీజర్ వచ్చాక క్లారిటీ రావొచ్చు