Begin typing your search above and press return to search.

హీరోగా ఫ్లాప్‌.. నిర్మాతగా కూడా అదే తప్పు!

By:  Tupaki Desk   |   16 Nov 2018 5:30 PM GMT
హీరోగా ఫ్లాప్‌.. నిర్మాతగా కూడా అదే తప్పు!
X
ముంబయి నుండి వచ్చి తెలుగులో హీరోగా పరిచయం అయిన సచిన్‌ జోషి చేసిన చిత్రాల్లో ఏ ఒక్కటి పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. తెలుగులో ఒక చిత్రం చేయడం కొన్నాళ్లు కనిపించకుండా పోవడం, మళ్లీ తెలుగులో హీరోగా నటించడం చేస్తూ వస్తున్నాడు. దశాబ్దంనర నుండి సచిన్‌ జోషి తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తన సినిమాలను తానే నిర్మించుకుంటూ ప్రయోగం చేసేవాడు. కాని ఏ ఒక్కటి కూడా సచిన్‌ జోషికి లాభాలను తెచ్చి పెట్టలేక పోయాయి. తెలుగు సినిమాల వల్ల భారీగానే నష్టపోయాడని చెప్పుకోవాలి.

‘నీ జతగా నేనుండాలి’ చిత్రంను బండ్ల గణేష్‌ పేరు పెట్టి తానే స్వయంగా నిర్మించాడు. ఆ చిత్రం సమయంలో సచిన్‌ జోషికి బండ్ల గణేష్‌కు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ గొడవ కోర్టు వరకు వెళ్లింది. అప్పటి నుండి సచిన్‌ జోషి టాలీవుడ్‌ లో పెద్దగా కనిపించడం లేదు. మళ్లీ ఇన్నాళ్లకు నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. సందీప్‌ కిషన్‌, తమన్నా జంటగా హిందీ దర్శకుడు కునాల్‌ కోహ్లీ దర్శకత్వంలో ‘నెక్ట్స్‌ ఏంటీ’ అనే చిత్రాన్ని సచిన్‌ నిర్మించాడు.

హిందీ దర్శకుడు కునాల్‌ కోహ్లీ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడం ఏంటో, సందీప్‌ కిషన్‌ మరియు తమన్నా జోడీ ఏంటో అంటూ సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. సచిన్‌ జోషి తెలుగులో సరైన కథలు ఎంపిక చేసుకుని హీరోగా నటించలేదు కనుక, హీరోగా సక్సెస్‌ కాలేక పోయాడు. ఇప్పుడు మరోసారి మంచి కాంబినేషన్‌ ఎంపిక చేయకుండా సినిమా నిర్మిస్తున్న కారణంగా ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ‘నెక్ట్స్‌ ఏంటీ’ చిత్రం నిర్మాత సచిన్‌ జోషి అనే విషయాన్ని ముందు నుండి చెప్పకుండా సినిమా విడుదల సమయంలో చెప్పడం అందరిని ఆశ్చర్యంను కలిగిస్తోంది. హీరోగా చేసిన తప్పు నిర్మాతగా కూడా సచిన్‌ జోషి చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.