Begin typing your search above and press return to search.

సావిత్రి డబ్బులు జెమిని తీసుకున్నాడా?

By:  Tupaki Desk   |   15 May 2018 11:30 PM GMT
సావిత్రి డబ్బులు జెమిని తీసుకున్నాడా?
X
సావిత్రి జీవితంలో విషాదం మొత్తానికి ఆమె భర్త జెమిని గణేశనే కారణం అంటారు చాలామంది. నటిగా తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సావిత్రికి గొప్ప గొప్ప సంబంధాలు వచ్చేవని.. కానీ అప్పటికే ఒకరిని పెళ్లి చేసుకుని.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న జెమిని.. సావిత్రిని అమాయకురాలిని చేసి పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత ఆమెను మోసం చేసి మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని.. అలాగే సావిత్రి డబ్బుల్ని కాజేశాడని రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో చాలా వాటికి ‘మహానటి’ సమాధానం ఇచ్చింది. సావిత్రిని జెమిని పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిణామాల్ని సానుకూల దృక్కోణంలోనే చూపించారు. ఆ తర్వాత జెమిని దారి తప్పిన విషయాన్ని కూడా కొంచెం సున్నితంగానే చెప్పారు.

ఐతే సావిత్రి ఆర్థికంగా సంక్షోభంలో పడటానికి మాత్రం ఆయనేమీ కారణం కాదన్నట్లే సినిమాలో చూపించారు. ఇది అబద్ధమని.. అందులో జెమిని పాత్ర ఉందని చాలామంది అంటుంటారు. ఈ విషయంలో సావిత్రి తనయురాలు విజయ ఛాముండేశ్వరి స్పందించారు. తన తల్లి నుంచి జెమిని ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఒక ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో జెమిని నుంచి కానీ.. ఆయన పెద్ద భార్య కుటుంబం నుంచి కానీ సావిత్రి కూడా ఏమీ తీసుకోలేదన్నారు. జెమిని పెద్ద భార్య అలిమేలుతో సావిత్రికి మంచి సంబంధాలుండేవని.. ఆమెను జెమిని లాగే సావిత్రి కూడా ‘బాబ్జీ’ అని పిలిచేదని.. తాము ఆమెను పెద్దమ్మ అనేవాళ్లమని.. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలుండేవని చెప్పారు. అంతే కాక జెమిని పెద్ద భార్య పిల్లల్ని సావిత్రి ఆదరించేదని.. అమ్మాయిలకు జడలు వేయడం.. భోజనం పెట్టడం కూడా చేసేదని ఆమె అన్నారు. సావిత్రిని ఎక్కువగా మోసం చేసింది ఆమె బంధువులు.. పనివాళ్లే అని ఆమె స్పష్టం చేసింది. వాళ్ల వల్ల చాలా నగలు.. డబ్బు.. ఆస్తులు పోయాయన్నారు. ఐతే చివరికి ఆమెకు మూడు ఇళ్లు, మరికొన్ని ఆస్తులు మిగిలాయని.. వాటినే తాను తన తమ్ముడు సతీష్ పంచుకుని జీవితంలో సెటిలయ్యామని చెప్పారు.