Begin typing your search above and press return to search.

ఆ సంస్థ దివాలా.. అందుకే 2.0 వాయిదా

By:  Tupaki Desk   |   17 Feb 2018 8:28 AM GMT
ఆ సంస్థ దివాలా.. అందుకే 2.0 వాయిదా
X
శంకర్-రజనీకాంత్ మెగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘2.0’ షూటింగ్ గత ఏడాది వేసవిలోనే పూర్తయినట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. రాబోయే కొన్ని నెలల్లో కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏడాది దీపావళికి అని.. ఈ ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్లో అని.. ఏప్రిల్ తమిళ సంవత్సరాది కానుకగా అని.. రకరకాల డేట్లు ఇచ్చారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. రజినీ మరో సినిమా ‘కాలా’ను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ నెలలో కూడా ఈ చిత్రం రిలీజ్ కాదని తేలిపోయింది. తాజా సమాచారం ప్రకారం జూన్ లేదా జులైలో ఈ సినిమా విడుదల ఉండొచ్చని అంటున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కావడం వల్లే ‘2.0’ లేటవుతోందన్నది స్పష్టం. ఐతే ఎంత లేట్ చేసినప్పటికీ మరీ ఏడాది పైగా దీనికే సమయం కేటాయించినా పని పూర్తి కాకపోవడం ఆశ్చర్యమే. ఇంతకీ ఇక్కడొచ్చిన ఇబ్బంది ఏంటి అంటే.. అమెరికాకు చెందిన ఒక పెద్ద వీఎఫెక్స్ సంస్థకు ‘2.0’ వర్క్ అప్పగించారట. ఆ సంస్థ అనుకున్న సమయానికి ఔట్ పుట్ ఇవ్వలేదు. దీంతో ఆ సంస్థకు లీగల్ నోటీస్ ఇవ్వనున్నట్లు వార్తలొచ్చాయి. తాజా సమాచారం ఏంటంటే.. ఆ సంస్థ ఆ తర్వాత కూడా ఔట్ పుట్ ఇవ్వలేదట. ఎన్నో హాలీవుడ్ సినిమాలకు కూడా పని చేసిన ఆ సంస్థ.. కొన్ని కారణాల వల్ల దివాళా తీసిందట. ‘2.0’తో పాటు చాలా సినిమాలకు హ్యాండిచ్చిందట. ఇక చేసేది లేక వాళ్లు మధ్యలో వదిలేసిన పనిని కూడా పక్కన పెట్టి కొత్తగా వేరే సంస్థకు వీఎఎక్స్ పనులు అప్పగించార ‘2.0’ దర్శక నిర్మాతలు. కాబట్టే ఈ సినిమా ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదంటున్నారు.