Begin typing your search above and press return to search.

మూడు ఒకటేనా మాస్ రాజా

By:  Tupaki Desk   |   19 Jun 2018 6:27 AM GMT
మూడు ఒకటేనా మాస్ రాజా
X
కొత్త సంవత్సరం మాస్ మహారాజా రవితేజకు అచ్చిబాటు రాలేదు. తనకు బలమైన మాస్ ని టార్గెట్ చేస్తూ రొటీన్ ఫార్ములాలో చేసిన టచ్ చేసి చూడు-నెల టికెట్టు రెండూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. రెండేళ్లు గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ తో కాస్త చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించాక మళ్ళి పాత స్కూల్ లోకే వెళ్లిపోవడం నిజంగా కలవరపరిచే అంశమే. ప్రస్తుతం రవితేజ శీను వైట్లతో అమర్ అక్బర్ ఆంటోనీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ని బట్టి ఇందులో రవితేజ మొదటి సారి ట్రిపుల్ రోల్ చేసుంటాడన్న ప్రచారం కాస్త బలంగానే జరిగింది. అందులో మూడు పేర్లు కూడా అదే సూచిస్తున్నాయి కాబట్టి జై లవకుశ తర్వాత టాలీవుడ్ లో మరో త్రిపాత్రాభినయం సినిమా చూడొచ్చు అనుకున్నారందరు.

కానీ కొత్త అప్ డేట్ ప్రకారం అదేమీ లేదట. సినిమా ఇంటర్వెల్ దాకా ప్రేక్షకులను మూడు పాత్రలు ఉన్నట్టే భ్రమింపజేసి తర్వాత తూచ్ అదేమీ లేదు నేనొక్కడినే అని చెప్పించి ట్విస్ట్ ఇచ్చి షాక్ ఇస్తారట. అంటే అప్పటి దాకా అమర్ అక్బర్ ఆంటోనీ పేరుతో మనకు కనిపించే ముగ్గురు రవితేజలు ఒకే పాత్రకు చెందినవన్నమాట. అయినా ఇదేమి కొత్త ట్విస్ట్ కాదు. గతంలో బాబీ రవితేజ తో చేసిన అతని డెబ్యూ మూవీ పవర్ కూడా అచ్చం ఇదే తరహాలో సాగుతుంది. సినిమా ముప్పాతిక శాతం దాకా ఇద్దరు రవితేజలు ఉంటారు. ఒకరు ఫ్లాష్ బ్యాక్ లో చనిపోయి ఉంటారు ఇంకొకరు ఇప్పుడు చూస్తున్నాం అనుకున్న ఆడియన్స్ చివరిలో అదేమి లేదు రెండూ నేనే అని చెప్పడం చూసి షాక్ తిన్నారు. కాకపోతే ఎంటర్ టైన్మెంట్ తో పాటు మసాలా అంశాలు పుష్కలంగా ఉండటంతో పవర్ సినిమా కమర్షియల్ గా ఫుల్ పాస్ అయిపోయింది.

ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ వరస చూస్తుంటే అదే తీరులో ఉంది. అసలే శీను వైట్ల మూడు స్టార్ డిజాస్టర్ల తర్వాత తీస్తున్న సినిమా. అందరు మర్చిపోయిన ఇలియానాను హీరోయిన్ గా పెట్టుకున్నారు. మరోవైపు హీరో రవితేజనే ఫ్లాపుల తాకిడిలో ఉన్నాడు. ఇన్ని ప్రతికూలతల మధ్య మైత్రి సంస్థ దీన్ని నిర్మించడం ఒక్కటే పాజిటివ్ ఫాక్టర్. అమర్ అక్బర్ ఆంటోనీ టైటిల్ లో సైతం కొత్తదనం లేదు. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం వచ్చిన హిందీ మల్టీ స్టారర్ పేరు ఇది. మరి మాస్ రాజా ఈ ఛాలెంజ్ ని ఫేస్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర నెగ్గడం శీను వైట్ల చేతుల్లో ఉంది.