Begin typing your search above and press return to search.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' తో వైసీపీకే కష్టమట!!

By:  Tupaki Desk   |   20 Oct 2018 10:58 AM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వైసీపీకే కష్టమట!!
X
రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఎన్టీఆర్ జీవితంలోని విభిన్న కోణాన్ని వెండి తెరపై చూపించడానికి అతను రెడీ అయిపోయాడు. ఇంతకుముందు అనౌన్స్ చేసి ఆపేసిన ఈ చిత్రాన్ని పట్టాలెక్కించి శరవేగంగా సినిమా పూర్తి చేయడానికి వర్మ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఐతే ఓవైపు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత కథతో ‘యన్.టి.ఆర్’ చేస్తున్న సమయంలోనే వర్మ ఈ చిత్రాన్ని తలపెట్టడం చర్చనీయాంశమైంది. బాలయ్య ‘యన్.టి.ఆర్’ తెలుగుదేశం పార్టీకి మైలేజీ తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. ఎన్టీఆర్‌ ను ఇబ్బంది పెట్టిన చంద్రబాబును విలన్‌ గా చూపించే అవకాశమున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టీడీపీకి ఇబ్బందిగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాకేశ్ రెడ్డి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు నిర్మాతగా మారడం చర్చనీయాంశమైంది. అతడితో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు తిరుపతిలో జరిగిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్లోనూ పాల్గొన్నారు. దీంతో ఈ చిత్రం వైఎస్సార్ కాంగ్రెస్ బ్యాకప్‌తోనే తెరకెక్కుతోందని అందరూ అనుకుంటున్నారు. ఐతే ఈ విషయమై వర్మ లాజిక్ మరోలా ఉంది. ఈ సినిమాకు వైసీపీకి సంబంధం లేదని.. ఈ చిత్రం వల్ల ఆ పార్టీకి కలిగే ప్రయోజనం ఏమీ లేదని అంటున్నాడతను. ఒక వ్యక్తి శత్రువు వచ్చి ఆ వ్యక్తి గురించి చెడుగా ఇంకొకరికి ఏదైనా చెబితే నమ్మడని.. దాని వల్ల క్రెడిబిలిటీ పోతుందని.. ఈ కోణంలో చూస్తే టీడీపీకి శత్రువైన వైఎస్సార్ కాంగ్రెస్ వచ్చి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు బ్యాకప్‌ గా నిలిస్తే వాళ్ల క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని.. ఈ రకంగా చూస్తే వాళ్లను ఈ చిత్రం డ్యామేజ్ చేస్తుందని వర్మ అన్నాడు. రాకేశ్ రెడ్డికి వైసీపీ వాళ్లతో సంబంధం ఉండొచ్చని.. కానీ వైసీపీకి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు మాత్రం ఏ సంబంధం లేదని.. ఇది నూటికి నూరుపాళ్లు నిజమని వర్మ తేల్చాడు.