Begin typing your search above and press return to search.

అకున్... అమ‌రేంద్ర‌ బాహుబ‌లి అట‌!

By:  Tupaki Desk   |   22 July 2017 6:14 AM GMT
అకున్... అమ‌రేంద్ర‌ బాహుబ‌లి అట‌!
X
తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేకించి తెలుగు సినీ ఇండ‌స్ట్రీ టాలీవుడ్‌ లో పెను క‌ల‌క‌లం రేపుతున్న‌మాద‌క‌ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రా, వాడ‌కం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎక్క‌డ చూసినా... ఈ చీక‌టి దందాలో తాజాగా తెరపైకి వ‌చ్చే ప్ర‌ముఖులెవ‌ర‌న్న చ‌ర్చ‌తో పాటు ఇప్ప‌టికే పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన వారికి అస‌లు డ్ర‌గ్స్ అల‌వాటు ఉందా? అన్న కోణంపైనా చ‌ర్చ సాగుతోంది. అస‌లు ఈ విష‌యంపై కామెంట్లు చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు భ‌య‌ప‌డుతున్నారు. దీనిపై ఎక్క‌డ నోరు విప్పితే... ఏం ప్ర‌మాదం ముంచుకోస్తుందోన‌న్న భ‌యాందోళ‌న‌లు వెంటాడుతున్నాయి. దీంతో అటు డ్ర‌గ్స్‌కు సంబంధం ఉన్న‌వారితో పాటు ఆ మ‌హ‌మ్మారికి ఆమ‌డ దూరం ఉన్న వారు కూడా ప్ర‌తిస్పందించేందుకు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి కీల‌క త‌రుణంలో బాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, నిత్యం వివాదాల‌తో సావాసం చేసే రాంగోపాల్ వ‌ర్మ‌... దీనిపై త‌న‌దైన శైలిలో స్పందించారు.

తొలుత ద‌ర్యాప్తు జ‌రుగుతున్న తీరు, కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీని మాత్ర‌మే టార్గెట్ చేసుకుని జ‌రుగుతున్న విచార‌ణ‌లపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే వ‌ర్మ వ్యాఖ్య‌ల‌పై క్ష‌ణాల్లో జ‌నం ఘాటుగా స్పందించ‌డంతో దిమ్మ తిరిగిపోయిన వ‌ర్మ‌... వెనువెంట‌నే ద‌ర్యాప్తు తీరుపైనే కాకుండా... ద‌ర్యాప్తును ప‌ర్య‌వేక్షిస్తున్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి అకున్ స‌బ‌ర్వాల్‌పై, తెలంగాణ ఎక్సైజ్ శాఖ‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ మ‌రో కామెంట్ చేయ‌క త‌ప్ప‌లేదు. అయినా వ‌ర్మ ఈ డ్ర‌గ్స్ దందాపై చేసిన కామెంట్ల వివ‌రాల్లోకెళితే... ద‌ర్యాప్తు జ‌రుగుతున్న తీరును వ‌ర్మ పూర్తిగా త‌ప్పుబ‌ట్టారు. సినీ ఇండ‌స్ట్రీని స‌బ‌ర్వాల్ టార్గెట్ చేశారంటూ స‌బ‌ర్వాల్‌పై ఆరోప‌ణ‌లు గుప్పించిన ఆయ‌న‌... అకున్‌ను మీడియా బాహుబ‌లి-2లోని అమ‌రేంద్ర బాహుబ‌లితో పోల్చేస్తూ భారీ ఎత్తున ప్ర‌చారం క‌ల్పిస్తోంద‌ని సెటైర్లేశారు. అకున్‌ను హీరోగా పెట్టుకుని ఎస్ఎస్ రాజ‌మౌళి ఇప్పుడు బాహుబ‌లి-3 తీస్తే స‌రిపోతుందేమోనంటూ కూడా వ్యంగ్యాన్ని పీక్స్‌కు తీసుకెళ్లారు.

బ‌డా బాబుల‌కు చెందిన స్కూలు పిల్ల‌ల‌ను ఇలానే విచారిస్తారా అంటూ ఆయ‌న చేసిన కామెంట్ల‌తోనే స‌రిపెట్ట‌కుండా... తెలంగాణ ఎక్సైజ్ శాఖ అస‌లు ప్ర‌జ‌ల‌కే తెలియ‌ని శాఖ అంటూ కూడా త‌న‌దైన సెటైరిక్ బుద్ధిని ప్ర‌ద‌ర్శించారు. ట్విట్ట‌ర్‌లో ఆయ‌న చేసిన ఈ కామెంట్ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో వ‌ర్మ ఈ సారి కొన్ని గంట‌ల‌ వ్య‌వ‌ధిలోనే దిగిరాక త‌ప్ప‌లేదు. గ‌తంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెబుతూ వ‌చ్చిన వ‌ర్మ‌... త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించే వారిపై మ‌రింత ఘాటు విమ‌ర్శ‌లు చేసేవారు. అయితే ఈ ద‌ఫా మాత్రం అందుకు విరుద్ధంగా తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్లుగా కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక వ‌ర్మ కామెంట్ల‌ను యాజిటీజ్‌గా చూస్తే... *పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తదితరులకు నోటీసులు ఇచ్చి విచారించినట్లు స్కూల్ పిల్లలను కూడా 12గంటలపాటు విచారించగలరా? డ్రగ్స్ ఏమైనా కొత్త విషయా? సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఎక్సైజ్ శాఖ ప్రచారం పొందుతోంది. ఆ శాఖ అంటే ఇప్పటికీ ఎవరికీ తెలియదు. డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారి అకున్ సబర్వాన్‌ను మీడియా అమరేంద్ర బాహుబలి రేంజిలో ప్రచారం కల్పిస్తోంది. ఎస్ఎస్ రాజమౌళి.. అకున్ సబర్వాల్‌తో బాహుబలి3 చేయొచ్చు* అని తొలుత త‌న‌దైన శైలిలో వ‌ర్మ కామెంట్ చేశారు. అయితే త‌న కామెంట్ల‌పై నెటిజ‌న్ల‌తో పాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ చంద్ర‌వ‌ద‌న్ కూడా ఘాటుగా స్పందించ‌డంతో వ‌ర్మ దిగిరాక త‌ప్ప‌లేదు.

తొలుత తాను పోస్ట్ చేసిన కామెంట్లు కాస్తంత త‌ప్పేన‌ని ఒప్పేసుకున్న‌ట్లుగా వ‌ర్మ కేవ‌లం కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి కామెంట్లు పోస్ట్ చేశారు. *డ్రగ్స్ కేసు విచారిస్తున్న అకున్ సబర్వాల్ చిత్తశుద్ధిని, ఎక్సైజ్ శాఖ పనితీరును తాను శంకించడం లేదు. అయితే, మీడియాకు వస్తున్న లీకేజీల‌ను తప్పుపడుతున్నా. దీని వల్ల పలువురు సినీ ప్రముఖుల జీవితాలు నాశనమవుతాయి. దీని బాధ్యత సబర్వాల్ దే* అని వ‌ర్మ కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం వ‌ర్మ చేసిన కామెంట్లు, వాటిపై నెటిజ‌న్ల రెస్పాన్స్‌ - చంద్ర‌వ‌ద‌న్ ఘాటు రిప్లై - వ‌ర్మ రీ ట్వీట్లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.