Begin typing your search above and press return to search.

బాలయ్యతో వర్మ మైండ్ గేమ్!

By:  Tupaki Desk   |   20 Sep 2017 4:19 AM GMT
బాలయ్యతో వర్మ మైండ్ గేమ్!
X
నందమూరి బాలకృష్ణతో దర్శకుడు రాంగోపాల్ వర్మ మైండ్ గేమ్ ఆడుతున్నారా. ఎన్టీఆర్ జీవిత కథ చిత్రానికి తాను దర్శకత్వం వహించే అవకాశం కల్పించనందుకుగాను ఏదో ఒక రకంగా బాలకృష్ణ మీద అటు నుంచి నరుక్కుని రావడం ద్వారా వత్తిడి కలిగించి ఆ సినిమా అవకాశం తనకే దక్కడం కోసం రామ్ గోపాల్ వర్మ స్కెచ్ వేశారా. తను లక్ష్మి ఎన్‌టి‌ఆర్ పేరుతో లక్ష్మి పార్వతీల దాంపత్య జీవితం, ఆ తరువాతి పరిణామాల గురించి సినిమా తీయబోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేసి నందమూరి బాలకృష్ణలో తన నిర్ణయంపట్ల పునరాలోచన కలిగించి ఎన్టీఆర్ జీవిత ప్రొజెక్ట్ కి రామ్ గోపాల్ వర్మని ఎంచుకునే పరిస్థితిని కల్పించడానికి ఇదంతా ఒక స్కెచ్ లాగా వున్నదని పలువురు అనుమానిస్తున్నారు.

రాంగోపాల్ వర్మ తాను ఎన్టీఆర్ కి వీరాభిమానినని, ఆయన చిత్రాలు ఎగబడి చూసేవాడినని, ఎన్టీఆర్ జీవిత కథను తానే దర్శకత్వం చేస్తానని గతంలో చాలా ఆర్భాటం గా ప్రకటించారు. అయితే వర్మ ఇలా తనని సంప్రదించకుండా తన అనుమతి లేకుండా ఏకపక్షంగా తానే దర్శకత్వం వహించబోతున్నట్లు గా ప్రకటన చేయడం హీరో నందమూరి బాలకృష్ణకి ఎంతమాత్రము నచ్చలేదు. దానికి తగ్గట్లు గానే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఫైనలైజ్ చేసుకోవడానికి రాంగోపాల్ వర్మ పదే – పదే బాలకృష్ణని కలవడానికి ప్రయత్నించినప్పటికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదని పరిశ్రమలో గుస గుసలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఈ సినిమా నిర్మించదలుచుకుంటున్న వారి ద్వారా రాంగోపాల్ వర్మకి దర్శకత్వం ఇచ్చేది లేదని స్పష్టమైన సంకేతాలు బాలకృష్ణ పంపించినట్టు కూడా పరిశ్రమలో చెప్పుకున్నారు. అక్కడితో ఎన్టీఆర్ జీవిత కథకు వర్మ దర్శకత్వం వహించే ఎపిసోడ్ మొత్తం పూర్తైపోయిందనే అందరూ భావించారు. కాకపోతే దీనికి రెండో భాగం మిగిలే వుండిపోయింది.

సుదీర్ఘ కాలం గ్యాప్ తీసుకున్న రామ్ గోపాల్ వర్మ తాను లక్ష్మి ఎన్‌టి‌ఆర్ అనే చిత్రం చేయబోతున్నట్టుగా ఓ సంచలన ప్రకటన చేశారు. దానికి తోడు లక్ష్మి పార్వతి విజయవాడలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు వెన్నుపోటు వ్యవహారం నుంచి ఆ తరవాతి జీవితం లో నందమూరి తారక రామరావు అనుభవించిన పరిస్థితులు ప్రధాన కథాంశంగా రామ్ గోపాల్ వర్మ చిత్రం వుంటుందనే సంగతిని వెల్లడించారు. ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ పంపిన మనుషులే తన వద్దకు వచ్చి తెలియ చేశారని ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్‌టి‌ఆర్ జీవితనికి సంబంధించి ఆ భాగంలో ఆ పర్వంలో ఎలాంటి ఘట్టాలు సంభవించాయో తన ద్వారా సంగతులు తెలుసుకుని వెళ్ళారు అని కూడా లక్ష్మి పార్వతి వెల్లడించారు.

అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో ప్రధాన కథాంశం ఏమిటన్నది దాదాపుగా తేలిపోయినట్టే. ఎన్‌టి‌ఆర్ జీవితం లో ఏ అంశాలైతే బాహ్య ప్రపంచానికి మళ్ళీ మళ్ళీ చర్చకు రాకూడని నందమూరి కుటుంబ సభ్యులు కోరుకుంటారో ఆ అంశాలనే ప్రధాన కథాంశంగా రాంగోపాల్ వర్మ సంకేతాలు ఇస్తున్నాడు. ఈ చిత్రం బయటకు రాకుండా వుండాలంటే బాలకృష్ణ తాను ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ జీవిత కథ చిత్రానికి వర్మ కి దర్శకత్వ ఛాన్స్ ఇస్తే సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు కూడా వున్నారు. బాలకృష్ణ లో కూడా అలాంటి ఆలోచన కలిగించి తాను ఈ చిత్రం చేయకుండా వుండాలంటే ఆ చిత్రానికి దర్శకత్వ ఛాన్స్ ఇవ్వాలని డీల్ కుదుర్చుకోడానికి వర్మ మైండ్ గేమ్ ఆడుతునట్టుగా పలువురు సందేహిస్తున్నారు.