Begin typing your search above and press return to search.

అల్లు సెంటిమెంటును చిరుకూ అంటించేశాడా?

By:  Tupaki Desk   |   3 Dec 2016 3:58 PM GMT
అల్లు సెంటిమెంటును చిరుకూ అంటించేశాడా?
X
తెలుగులో ఓ మోస్తరు సినిమా ఏదైనా సరే.. ఆడియో ఫంక్షన్ విషయంలో చాలా హంగామా చేయడం మామూలే. భారీ ప్రాజెక్టు దేనికైనా ఆడియో వేడుక భారీగా ఉండాల్సిందే. కానీ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మాత్రం రూల్‌ ను బ్రేక్ చేశాడు. తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలకు ఆడియో వేడుకలు చేయకుండా ఆపించేశాడు. అది ఆయనకు ఒకరకంగా సెంటిమెంటుగా కూడా మారింది. ‘సరైనోడు’ లాంటి పెద్ద సినిమాకు ఆడియో వేడుక చేయకపోవడమేంటి అని అంతా ఆశ్చర్యపోయారు కానీ.. ఆడియోను డైరెక్టుగా మార్కెట్లోకి విడుదల చేసి.. ఆ తర్వాత ప్రి రిలీజ్ ఫంక్షన్ చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీశాడు అరవింద్. ఆ తర్వాత ‘శ్రీరస్తు శుభమస్తు’కి.. తాజాగా ‘ధృవ’కు కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించాడు.

ఐతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’కి కూడా ఇదే తంతు ఫాలో అవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు ఆడియో వేడుక చేయకుండా డైరెక్టుగా మార్కెట్లోకి ఆడియోను రిలీజ్ చేసేద్దామని చూస్తున్నారట. గీతా ఆర్ట్స్ సినిమాలకు చేసినట్లే ప్రి రిలీజ్ ఫంక్షన్ చేయడంపై ఆలోచిస్తున్నారట. అల్లు అరవింద్ సలహా మేరకు నిర్మాత చరణ్ ఈ మేరకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ విషయమై ఓ క్లారిటీ వస్తుంది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ నెల 18న ‘ఖైదీ నెంబర్ 150’ ఆడియో వేడుక జరగాల్సింది. ఐతే ఆడియో వేడుక చేసినా.. ప్రి రిలీజ్ ఫంక్షన్ చేసినా పెద్దగా తేడా ఏమీ ఉండదు కాబట్టి అభిమానులు పెద్దగా ఫీలవ్వాల్సిందేమీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/