Begin typing your search above and press return to search.

గోదావరి బైక్ మీద చరణ్ రచ్చ

By:  Tupaki Desk   |   21 Jan 2018 8:09 AM GMT
గోదావరి బైక్ మీద చరణ్ రచ్చ
X
రంగస్థలం షూటింగ్ చివరి దశ గోదావరి పరిసర గ్రామాల్లో శరవేగంగా జరుగుతోంది. విడుదలకు ఇంకా 70 రోజులే ఉన్న నేపధ్యంలో సుకుమార్ స్పీడ్ పెంచాడు. నిజానికి అందరు టాకీ పార్ట్ పూర్తయ్యింది అనుకున్నారు కాని ఇంకొంచెం బాలన్స్ మిగిలిపోవడంతో అది ఫినిష్ చేసే పడ్డారు. ఐటెం సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఫైనల్ గా గుమ్మడి కాయ కొట్టేస్తారు. 24న సాయంత్రం విడుదల కానున్న టీజర్ కోసం ఫాన్స్ చాలా అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న పరిసరాల్లో అభిమానుల తాకిడితో మహా సందడిగా ఉంది. ఒకదశలో పోలీసులు లాటీలకు పని చెప్పాల్సి వస్తే చరణ్ కల్పించుకుని మరీ వారించినట్టు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ప్రత్యక్షంగా చూసిన అభిమానుల ద్వారా తెలిసింది.

ఇక చరణ్ షూటింగ్ లో ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే అభిమానుల మధ్య వెళ్ళిపోయి హడావిడి చేసేస్తున్నాడు. తనే స్వయంగా బైక్ రైడ్ చేసుకుంటూ తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇది షూటింగ్ లో భాగంగా చరణ్ ప్రాక్టీసు చేస్తున్నాడా లేక సరదాగా బైక్ మీద వెళ్ళాలనే సరదా తీర్చుకున్నాడా క్లారిటీ లేదు. ఈ షెడ్యూల్ లోనే రామ్ చరణ్ - సమంతాల మీద ఒక పాట చిత్రీకరించినట్టు తెలిసింది. ఆది పినిశెట్టి - అనసూయ - జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న రంగస్థలంలో చరణ్ చిట్టిబాబు అనే పేరున్న పాత్రలో బధిరుడిగా నటిస్తున్న సంగతి ముందు నుంచే ప్రచారంలో ఉంది. మార్చ్ 30న విడుదల కానున్న రంగస్థలం ఆడియో లేదా ప్రీ రిలీజ్ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చ్ మొదటి వారం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీకి కెమెరా రత్నవేలు.