Begin typing your search above and press return to search.

నీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి త‌మ్ముడాః చ‌ర‌ణ్‌

By:  Tupaki Desk   |   15 July 2017 1:28 PM GMT
నీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి త‌మ్ముడాః చ‌ర‌ణ్‌
X
సాధార‌ణంగా హీరోల‌కు చాలామంది అభిమానులుంటారు. వారంద‌రినీ గుర్తుపెట్టుకోవ‌డం హీరోల‌కు సాధ్యం కాదు. కానీ, ముద్దు ముద్దు మాట‌ల‌తో త‌మ డైలాగ్ ల‌ను ట‌క‌ట‌కా చెప్పేసే చిన్నారి అభిమానులను మాత్రం హీరోలు గుర్తుపెట్టుకుంటారు. సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన రామ్ చ‌ర‌ణ్ చిన్నారి అభిమాని ప‌ర‌శురాం అనారోగ్యంతో క‌న్నుమూశాడు. ఆ బాలుడిని గుర్తుపెట్టుకున్న రామ్ చ‌ర‌ణ్ అత‌డికి ట్విట్ట‌ర్ లో సంతాపాన్ని తెలియ‌జేశాడు.

అనారోగ్యం తో బాధ‌ప‌డుతున్న ప‌ర‌శురాం సరైన సమయానికి వైద్యం అందక కన్ను మూసాడు. ప‌ర‌శురాం మరణ వార్త వినగానే బాధ పడ్డాడట చరణ్. రామ్ చ‌ర‌ణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో... " గుండె పగిలే వార్త, నీ ఆత్మకి శాంతి కలగాలి నా చిన్నారి తమ్ముడా" అంటూ ట్వీట్ చేశాడు. ప‌ర‌శురాం - రామ్ చ‌ర‌ణ్ క‌లిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి త‌న సంతాపాన్ని తెలిపాడు.

మహబూబ్‌ నగర్‌ లోని అయిజ గ్రామానికి చెందిన ప‌రశురాం ‘మగధీర’ సినిమాలోని డైలాగ్‌ లను అలవోకగా చెప్పేవాడు. అప్పట్లో అతడి డైలాగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. బాలుడు డైలాగ్‌ చెబుతున్న తీరును చూసిన రామ్‌ చరణ్‌ తన ఇంటికి పిలిపించుకుని సరదాగా కాసేపు ముచ్చటించాడు. అతడికి టీషర్ట్‌ కూడా కానుకగా ఇచ్చాడు. ఆ పిల్ల‌వాడిని తానే చదివిస్తానని, వాళ్ళ ఊరిలోనే ఒక ప్రైవేటు స్కూల్ లో చేర్పించాడు రామ్ చ‌ర‌ణ్‌. తర్వాత అతడు కోరినట్టే హీరో ని చేస్తాన మాటిచ్చాడు కూడా.