Begin typing your search above and press return to search.

ముగ్గురూ రెండోసారి వస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Jun 2018 4:23 AM GMT
ముగ్గురూ రెండోసారి వస్తున్నారు
X
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాల్లో ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే మూవీ 3 ఇడియట్స్. రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ విద్యావ్యవస్థలోని లోపాలను సునిశితంగా ఎత్తి చూపుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్ గా కథ నడుస్తుంది. ఈ సినిమా కేవలం ఇండియాతోపాటు చైనా లోనూ సూపర్ హిట్టయ్యి కలెక్షన్లు కొల్లగొట్టింది.

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఈ మూవీనే తమిళం నంబన్ (తెలుగులో స్నేహితుడు) పేరుతో రీమేక్ చేశాడు. శంకర్ పాటలు తప్ప 3 ఇడియట్స్ మూవీలో ఏ ఒక్క సీన్ నూ మార్చలేక పోయాడు. దాదాపుగా కార్బన్ కాపీలానే తీసుకుంటూ వచ్చాడు. అంత పర్ ఫెక్ట్ గా ఉంటుంది 3 ఇడియట్స్ స్క్రీన్ ప్లే. ఇన్నేళ్ల తరవాత ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని ఆలోచిస్తున్నాడు. రైటర్ అభిజిత్ జోషితో కలిసి ఈ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథతో హీరో రణ్ బీర్ కపూర్ తో సంజూ సినిమా తెరకెక్కించాడు రాజ్ కుమార్ హిరాని. సంజూ ప్రమోషన్ ఈవెంట్లలో భాగంగా 3 ఇడియట్స్ మూవీ సీక్వెల్ విషయం తనే స్వయంగా చెప్పాడు. అమీర్ కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు బాలీవుడ్ జనాలు చెబుతున్నారు. సంజూ తరవాత మున్నాభాయ్-3 తీయడానికి రాజ్ కుమార్ హిరాని కమిట్ అయ్యాడు. దాని తరవాత 3 ఇడియట్స్ సీక్వెల్ మొదలుపెట్టనున్నాడు.