Begin typing your search above and press return to search.

షాకింగ్‌ ప్రకటన చేసిన సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   20 Oct 2018 6:52 AM GMT
షాకింగ్‌ ప్రకటన చేసిన సూపర్‌ స్టార్‌
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఈమద్యే ‘కాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని చెప్పక తప్పదు. ఆ చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా, కాలా విడుదలైన రోజే ‘పేట’ చిత్రాన్ని రజినీకాంత్‌ ప్రారంభించాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా తమిళ సినిమా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు ‘పేట’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రజినీకాంత్‌ ఒక విభిన్నమైన పాత్రలో ‘పేట’ చిత్రంలో కనిపించబోతున్నాడట.

ఇప్పటికే ‘పేట’కు సంబంధించిన రజినీకాంత్‌ లుక్‌ లీక్‌ అయ్యింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సమయంలోనే షూటింగ్‌ పూర్తి అంటూ రజినీకాంత్‌ స్వయంగా ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చాడు. ‘పేట’ చిత్రీకరణ ప్రారంభం అయ్యి కనీసం నాలుగు నెలలు కూడా కాలేదు - అప్పుడే చిత్రీకరణ పూర్తి అవ్వడం ఏంటంటూ అభిమానులు మరియు సినీ వర్గాల వారు కూడా షాక్‌ అవుతున్నారు. ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు తక్కువలో తక్కువ ఆరు నెలల సమయం అయినా తీసుకుంటున్నారు. ఇక పెద్ద సినిమాలైతే సంవత్సరం - రెండు సంవత్సరాలు - అంతకు మించి కూడా సమయం తీసుకుంటున్నాయి.

ఇలాంటి సమయంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో సినిమాను కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయడం అంత సులువైన విషయం కాదు. పైగా ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్దిఖి - విజయ్‌ సేతుపతి - సిమ్రాన్‌ - త్రిష ఇంకా పలువురు స్టార్స్‌ ఉన్నారు. ఇంత మంది స్టార్స్‌ డేట్లు కుదరడమే కష్టం. అలాంటిది పక్కా ప్లానింగ్‌ తో అన్ని విధాలుగా ముందు జాగ్రత్తలు తీసుకుని చేసిన ‘పేట’ చిత్రం అనుకున్న సమయం కంటే 15 రోజుల ముందే చిత్రీకరణ పూర్తి చేసుకుంది అంటూ రజినీకాంత్‌ ప్రకటించాడు. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు కాని, వచ్చే జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరో వైపు రజినీకాంత్‌ ‘2.0’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.