Begin typing your search above and press return to search.

రాజమౌళి రాయబారం ఫలించలేదు

By:  Tupaki Desk   |   23 Aug 2017 9:15 AM GMT
రాజమౌళి రాయబారం ఫలించలేదు
X
రాజమౌళి కెరీర్లో ఎంతో రిస్క్ చేసి తీసిన సినిమా ‘ఈగ’. ఆ రోజుల్లోనే ఈ చిత్రానికి రూ.25 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. ఏ స్టార్ వాల్యూ లేకుండా ఒక ఈగ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమాకు అంత బడ్జెట్ పెట్టడం సాహసమే. ఆ సాహసం చేసిన సాయి కొర్రపాటి రాజమౌళికి బాగా నచ్చేశాడు. జక్కన్నకు ఆప్త మిత్రుడిగా మారిపోయాడు. ఆ సినిమాతో మొదలైన వారి స్నేహం మరింత బలపడుతూ వచ్చింది. సాయి కొర్రపాటి నిర్మాణంలో వచ్చే ప్రతి సినిమాకూ రాజమౌళి తన వంతుగా తోడ్పాటు అందిస్తుంటాడు. ఆయన సినిమాలకు ప్రమోషన్ చేసి పెడతాడు. సాయికి వేరే సాయాలు కూడా చేస్తుంటాడు. అప్పుడప్పుడూ కొన్ని సినిమా డీల్స్ లోనూ రాజమౌళి సాయం అందుతుంటుంది.

ఐతే ఈ మధ్య సాయి కొర్రపాటి వరుసగా మనమంతా.. రెండు రెళ్లు ఆరు.. పటేల్ సార్ లాంటి సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. చాలా డబ్బు నష్టపోయాడు. ఈ నష్టాల్ని డిస్ట్రిబ్యూషన్ ద్వారా పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు సాయి. ఈ విషయంలో సాయికి సాయం చేద్దామని రాజమౌళి.. శంకర్ మాగ్నమ్ ఓపస్ ‘2.0’ హక్కులు ఇప్పించే బాధ్యత తీసుకున్నాడట. ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో ఈ మేరకు చర్చలు కూడా జరిపాడట.

సాయితో కలిసి చెన్నై వెళ్లి లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో మీటింగ్ లో పాల్గొన్న జక్కన్న రూ.60 కోట్లు కోట్ చేసి హక్కుల కోసం అడిగినట్లు తెలిసింది. కానీ ఈ డీల్ ఓకే కాలేదు. లైకా వాళ్లు రూ.80 కోట్లకు తగ్గే ప్రసక్తే లేదని పట్టుబట్టి కూర్చున్నారట. ‘2.0’ స్కేల్ ప్రకారం ఈజీగా తెలుగులోనూ వంద కోట్లు కలెక్ట్ చేయగలదని.. అలాంటి సినిమాను రూ.60 కోట్లకు ఇచ్చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారట. సాయి అయితే సినిమాను బాగా ప్రమోట్ చేస్తారన్నా కూడా లైకా వాళ్లు ఒప్పుకోకపోవడం జక్కన్న నిరాశగా వెనుదిరిగినట్లు సమాచారం. చివరికి ‘2.0’ హక్కుల్ని గ్లోబల్ సినిమాస్ వాళ్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రూ.81 కోట్లకు లైకా వాళ్లు హక్కులు అమ్మినట్లు సమాచారం. సాయి కొర్రపాటితో పాటు చదలవాడ శ్రీనివాసరావు సైతం ‘2.0’ హక్కుల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.