Begin typing your search above and press return to search.

ఆర్జీవీకి నాయ‌కుల డూప్ కావాల‌ట‌

By:  Tupaki Desk   |   17 Aug 2019 9:02 AM GMT
ఆర్జీవీకి నాయ‌కుల డూప్ కావాల‌ట‌
X
ఆర్జీవీ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఎన్నో వివాదాల న‌డుమ రిలీజైన సంగ‌తి తెలిసిందే. వివాదాల‌తో ప్ర‌చారం చేసుకున్నా ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ కాలేదు. రిలీజ్ ముంగిట ఎన్నో ఆప‌సోపాలు ప‌డిన వ‌ర్మ ఎన్నిక‌ల కోడ్ దెబ్బ‌కు నానా యాగీ చేశారు. విజ‌య‌వాడ‌లో ఆర్జీవీ ప్రెస్ మీట్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. నంద‌మూరి కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో నంద‌మూరి ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఆ సినిమా త‌ర్వాత `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` అంటూ మ‌రో సినిమాని ఆర్జీవీ ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల కొంత సైలెంట్ గా ఉన్న ఆర్జీవీ ఉన్న‌ట్టుండి `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` షూటింగ్ ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ల‌క‌ ముందే మ‌రోసారి త‌న‌దైన మార్క్ ప్ర‌చార హంగామా ప్రారంభించారు. మొన్న‌నే టైటిల్ పై లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు ఆర్జీవీ. తాను ఎంచుకున్న క‌థేంటి? రాజ‌కీయ నాయ‌కుల్ని ఏ కోణంలో చూపించ‌బోతున్నాడో ఈ లిరికల్ సాంగ్ తోనే అర్థ‌మైంది. ముఖ్యంగా ఏపీ రాజ‌కీయాల్ని ఆర్జీవీ ట‌చ్ చేస్తున్నారు. అక్క‌డ కుల రాజ‌కీయాల్ని ఒక ర‌కంగా ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని అర్థ‌మైంది.

వ‌ర్త‌మాన రాజ‌కీయాల‌పైనా.. రాజ‌కీయ నాయ‌కుల పైనా సినిమా కాబ‌ట్టి ఇందులో పాత్ర‌ధారుల ఎంపిక ఆస‌క్తిక‌రంగా మారింది. మాజీ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు- ప్ర‌స్తుత ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇరువురి వైరం నేప‌థ్యంలో ఈ సినిమా క‌థాంశాన్ని వండి వార్చార‌ని అత‌డి టైటిలే చెప్పేస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు పాత్ర‌ధారుల కోసం ఆర్టిస్టుల్ని జ‌ల్లెడ ప‌డుతున్నార‌ట‌. అలాగే ఈ చిత్రంలో ఇత‌ర కీల‌క పాత్ర‌ల కోసం ఆర్టిస్టుల్ని వెతుకుతున్నారు. ఒక‌సారి జాబితాను ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు- వైయ‌స్ జ‌గ‌న్- వైకాపా మ‌హిళా నాయ‌కురాలు రోజా- లోకేష్ నాయుడు- నారా బ్రాహ్మ‌ణి- నారా దేవాన్ష్‌- దేవినేని ఉమ‌- కేసినేని నాని-కోడెల శివ ప్ర‌సాద్- గంటా శ్రీ‌నివాస‌రావు-సుజ‌నా చౌద‌రి- అచ్చ‌య్య నాయుడు- స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం- స్పీక‌ర్ బుచ్చ‌య్య చౌద‌రి- ఎస్పీ గౌత‌మ్ .. త‌దిత‌ర పాత్ర‌ల కోసం ఆర్టిస్టుల్ని వెతుకుతున్నారు. అలాగే జాతీయ స్థాయి నాయ‌కుల డూప్ ల కోసం వెతుకుతున్నారు. భార‌త దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ- అమిత్ షా త‌దిత‌ర పాత్ర‌ల‌కు డూప్ ల‌ను వెతుకుతున్నార‌ని తెలుస్తోంది. అందుకు ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో ఆర్జీవీ పోస్టింగులు పెట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రాజ‌కీయ నాయ‌కుల్ని .. కులాల్ని కెలుకుతూ వ‌ర్మ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం చూస్తుంటే మ‌రోసారి వివాదాలు పీక్స్ కి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.