Begin typing your search above and press return to search.

పూరి చేసిన పాపం ఏంటి?

By:  Tupaki Desk   |   25 July 2017 5:53 PM GMT
పూరి చేసిన పాపం ఏంటి?
X
డ్ర‌గ్స్ విచార‌ణ రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారం రేపుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ సినీ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ కు ఉన్న లింకుల మీదా.. అధికారులు ఇచ్చిన నోటీసుల మీదా.. ప్ర‌ముఖుల్ని విచారించిన వైనం మీదా ప‌లు ర‌కాల క‌థ‌నాలు మీడియాలో వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌నే డ్ర‌గ్స్ విచార‌ణ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. డ్ర‌గ్స్ పేరు చెప్పుకొని.. నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది.

సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్లుగా డ్ర‌గ్స్ ఉదంతంలో మీడియా రోల్ మీద తిట్టుడు కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు. వ్య‌క్తుల మీద అభిమానం మామూలే. అయితే.. ఇది కాస్తా మోతాదు పెరిగి తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎవ‌రి దాకానో ఎందుకు.. డ్ర‌గ్స్ ముచ్చ‌ట‌లో కీల‌క నిందితుడిగా భావిస్తున్న‌కెల్విన్ తండ్రిగారి మాట‌లు.. ఆయ‌న లాయ‌ర్ మాట‌లు వింటే డ్ర‌గ్స్ అంటే కెల్విన్‌కు అస్స‌లు తెలీద‌ని.. నోట్లో వేలు పెడితే ఏం చేయాల‌ని అడుగుతాడ‌న్న‌ట్లుగా చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ఇక‌.. సినీ ప్ర‌ముఖుల విష‌యానికి వ‌స్తే.. డ్ర‌గ్స్ ఎపిసోడ్ లో ప్ర‌పంచంలో ఎవ‌రూ లేన‌ట్లు అధికారుల దృష్టి మొత్తం సినిమా వాళ్ల మీద‌నే ప‌డిందంటూ మండిప‌డుతున్నారు.

అక్క‌డితో ఆగ‌కుండా.. డ్ర‌గ్స్ విచార‌ణ మీద వార్త‌లు ప్ర‌సారం చేసే క‌న్నా.. మీడియాకు మ‌రే ప‌ని లేదా? అంటూ కౌంట‌ర్ అటాక్‌ను మొద‌లెట్టారు. ఆ మాట‌కువ‌స్తే మీడియాకు మాత్ర‌మే కాదు.. సిట్ అధికారుల మీద కూడా. స‌మాజంలో ఎంతోమంది డ్ర‌గ్స్ వాడుతుంటే.. ఒక్క సినిమా వాళ్లే క‌నిపిస్తున్నారా అకున్ స‌బ‌ర్వాల్ కు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలా ఎవ‌రికి వారు తాము అభిమానించే వారికి అండ‌గా వాద‌న‌లు వినిపించే ధోర‌ణి సోష‌ల్ మీడియాలో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

తాజాగా పూరీ మీద కూడా ఆయ‌న్ను అమితంగా అభిమానించే వ్య‌క్తి ఎవ‌రో పూరీని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక భారీ పోస్ట్ రాసేసి ఫేస్ బుక్ లో పెట్టేశాడు. అందులో ఏముందంటే.. "ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరు వాళ్లకు నచ్చినవి తీసుకుంటూ రిలాక్స్ అవుతుంటారు.అయినా, భూమి మీదున్న ప్రతోడు మనిషే. దేవుడు కాదు. మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా వుంటాయి. ఇందులో ఆశ్ఛర్య పోవాల్సింది ఏం లేదు" అంటూ పూరీకి అండ‌గా నిలుస్తూ ఓ వాద‌న‌ను వినిపిస్తూ పోస్ట్ చేశాడు. దాన్ని ఫేస్ బుక్ లో పూరీ పోస్ట్ చేసేయ‌టం ద్వారా.. త‌న‌ను త‌ప్పు ప‌డుతున్న వారిని.. త‌న‌పై వ్య‌తిరేక వార్త‌ల్ని అచ్చేస్తున్న వారికి షాకిచ్చే కంటెంట్ ఉన్న పోస్ట్ ను పోస్ట్ చేశారు. ఇందులో పోలీసుల్ని.. మీడియా వాళ్ల‌ను ఏ మాత్రం వ‌ద‌ల‌కుండా ఫుట్ బాల్ ఆడేశాడు. ఎంత‌లా అన్న‌ది మీరే చ‌ద‌వండి. పూరీ ఇప్పుడు ఎలాంటి మైండ్ సైట్ లో ఉన్నాడో తాజాగా ఆయ‌న పోస్ట్ చేసిన సుదీర్ఘ వాద‌న‌ను చ‌దివితే విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇంకెందుకు ఆల‌స్యం..

రాజకీయ నాయకుడిలా అదిచేస్తాం ఇది ఇస్తాం...అని మభ్యపెట్టి గెలిచాక మాటమార్చాడా? మీ నోటికాడ కూడు లాగేసుకొని మీ ఉసురు పోసుకున్నాడా?లేదే. 17యేళ్ళ క్రింద ఇండస్ట్రీకి వచ్చాడు. గాడ్ ఫాదర్ లేకుండా ఇంతింతై వటుడింతై అన్న చందాన కష్టపడి తానెదుగుతూ తనతో వున్న వారిని ఎదగనిచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు.
అతనికి తెలిసిందల్లా ఒకటే ప్రేక్షకుడు రూ.100 పెట్టి టికెట్ కొని.. ఓ మూడు గంటలు తన విలువైన సమయాన్ని సినిమా చూడటం కోసం వెచ్చిస్తే... ఎలా ఆ ప్రేక్షకున్ని సినిమా చూస్తున్నంత సేపు తనే హీరో అయితే "అచ్చం ఇలాగే డైలాగులు చెప్తా.. ఇలాగే విలన్లని ఇరగ్గొడుతా.. హీరోయిన్స్ తో డాన్సులు చేస్తా ష‌ అని తన కష్టాన్ని మరిచిపోయి లీనమయ్యేలా సినిమాలు తీయటం తెలుసు.

పూరి స్ట్రైట్ ఫార్వ‌ర్డ్‌గా వుంటాడు. అప్పటికీ ఇప్పటికీ అతనికి తెలియంది ఒకటే ఒకరికి భజన చేయటం.. కొమ్ము కాయడం. బుల్లెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తాడు. సందేశాలు సమోసాలు అని సినిమా లో చెబితే ఎవ్వరూ వినరంటాడు. తను చేసే పనికి వందకి వంద శాతం న్యాయం చేశాడు. హిట్టు ఫట్టుతో సంబంధం లేదు.

కాలంతో కలిసి ముందుకెళ్లాలనే రమణ మహర్షి సూక్తిని బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టే మధ్యలో ఒకసారి నమ్మిన వాళ్లే మోసం చేస్తే .. మరేం పర్లేదు అన్నట్లుగా నష్టాల్ని.. కష్టాల్ని ఎంతో ఇష్టంగా చిరునవ్వుతో స్వీకరించాడు. అందుకే కాబోలు పూరి తీసిన టెంపర్ సినిమా బిగినింగ్ లోనే "జీవితం ఎవ్వడ్నీ వదలదు అందరి సరదా తీర్చేస్తది" అన్న డైలాగ్ రాసి తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి.

బాణం బలంగా ముందుకు దూసుకెళ్లాలంటే వెనక్కే లాగాలి. సరిగ్గా అలాగే మండే సూర్యుడిలా పైకి లేచాడు. మళ్ళీ తెలివిగా సినిమాలు చేసి నిలబడ్డాడు. తనెంత మొండోడు అంటే ఒక్కసారి కమిటైతే తనమాట తనే వినడు. అందుకే ఎన్ని సమస్యలు రౌండప్ చేసి కన్ప్యూజ్ చేసినా తనేం చేయాలో తెలిసిన పిచ్చ క్లారిటీ వున్నోడు.

అందుకే ఐ ల‌వ్ ఇండియా.. ఐ హేట్ ఇండియ‌న్స్ అంటూ మ‌న‌కు పట్టిన బూజును దులపడానికి ఫిక్సైయ్యాడు. వినడు పూరీ ఎవరి మాటా వినడు. దర్శకుడంటే పూరిలా వుండాలి. మనం కూడా వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయి దర్శకుడు అవ్వాలని పల్లెటూళ్లో వున్న కుర్రాళ్ళు సైతం కలలుగనే రేంజికి ఎదిగాడు. ప్రతి హీరో హీరోయిన్ ఆ మాటకొస్తే ప్రతి ఆర్టిస్టు ఒక్కసారైనా పూరీ డైరెక్షన్ లో సినిమా చేయాలి అని టెంప్ట్ అయ్యేంతలా ఎదిగాడు.

చరిత్రలో గొప్పోళ్ళకి తప్పలేదు అవమానాలు.. నీలాపనిందలు. సరిగ్గా అదే ఇప్పుడు మన పూరీజగన్నాథ్ విషయంలో జరగబోతున్నట్లుంది! అయినా.. ఏ రంగంలో లేవా బొక్కలు? ఇప్పుడు కోడై కూస్తున్న మీడియా వాళ్లేమైనా శ్రీరామచంద్రులా? పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదని అనే సామెతలా వుంది మీడియావాళ్ల యవ్వారం. కక్ష కట్టి మరీ రుద్దుతున్నారు.

పూరీ అదనీ ఇదనీ చివరికి ప్రపంచాన్నే ఏదో చేయబోతున్నాడన్న ఒక భ్రమని అపోహని క్రియేట్ చేస్తున్నారు. జనాలు ఇదే నిజమని నమ్మేంతగా టీవీల్లో పొద్దు పొడిచింది మొదలు పొద్దుపోయేదాకా పూరీ అండ్ కోని మర్డర్ చేసిన వాళ్ళుగా హైలెట్ చేసి చూపిస్తుండటంతో.. ఏ పాపం తెలియని వాళ్ల తల్లీతండ్రీ.. భార్య పిల్లలు.. అన్నాతమ్ముళ్లు.. అక్కా చెల్లెళ్లూ బంధుమిత్రులు ఎంతటి మనోవేదనని అనుభవిస్తున్నారో టీఆర్పీ రేటింగ్స్ కోసం కక్కుర్తి పడే మీడియా కి అది అనవసరం.

సమాజంలో ఎన్ని సమస్యలు లేవు! రైతుల ఆత్మహత్యలు.. నిరుద్యోగం.. సంక్షేమ పథకాల్లో అవకతవకలు.. మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కల్తీ అవుతూ మనిషి జీవితాల్ని సర్వనాశనం చేసే కుట్రలు.. భూకబ్జాలు.. ఇలా ఎన్నిలేవని!కానీ మీడియా నైతికవిలువలకి పాతరేసి మరీ అబద్దాల్ని నిజాలుగా నమ్మించాలని కంకణం కట్టుకొని శక్తివంచన లేకుండా ఈ డ్రగ్స్ గురించే ప్రచారం చేస్తుంది. ఇది న్యాయమా?

పూరీకూడా మనలాగా సగటు మనిషే తనకి బాధలుంటాయ్.సంతోషాలుంటాయ్. భాదల్ని తగ్గించుకోవాలని వాటి నుంచి బయట పడాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరు వాళ్లకు నచ్చినవి తీసుకుంటూ రిలాక్స్ అవుతుంటారు.

అయినా,భూమి మీదున్న ప్రతోడు మనిషే.. దేవుడు కాదు. మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా వుంటాయి. ఇందులో ఆశ్ఛర్య పోవాల్సింది ఏం లేదు. దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి. కొంతమందిని నమ్మినందుకు మోసం చేసి కింగ్ మేకర్ని అప్పులపాల్జేశారు. ఆ అప్పులు తీర్చడంకోసం కష్టపడి సంపాదించుకున్న కార్లూ, బంగ్లాలు అమ్ముకున్నోడికి ఇంకెంత నొప్పుండాలి.

చీకటవ్వడమే ఆలస్యం, పబ్బుల్లో బార్లలో పీకలదాకా తాగి రోడ్ల మీద యాక్సిడెంట్స్ చేసే ఘనులు ఎంతమందో. చిన్న చిన్న ఓటమిలకే.. మనస్పర్థలకే సూసైడ్ లు చేసుకునే పిరికివాళ్ళ కన్నా పూరీ చేశాడని చెబుతున్నది నీచమైందా? కాదు. కాబోదు.

ఒకవేళ పూరీ మీడియాలో వస్తున్నట్లుగా డ్రగ్స్ తీసుకొని వుంటే అది తనకి నష్టం చేసేదే కానీ పక్కోడికి ఇసుమంతైనా హాని కలిగించేది కాదు. విధి రాతను తప్పించుకోవటం ఎవరివల్లా కాదు. కాబట్టి మీడియా సంయమనం పాటించాలి. రాబోయే కాలమే నిజాల్ని బయటపెడుతుంది.అప్పటిదాకా ఇంకొకరి మనసు గాయం చేయొద్దు.