Begin typing your search above and press return to search.

జాక్స్‌ మరణంతో విషాదంలో పూరి

By:  Tupaki Desk   |   17 April 2019 8:13 AM GMT
జాక్స్‌ మరణంతో విషాదంలో పూరి
X
ఎప్పుడు సరదాగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ విషాదంలో ఉన్నారు. ఎప్పుడు సంతోషంగా ఉండే పూరి ఇప్పుడు దుఖంలో ఉన్నాడు. అందుకు కారణం ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్క జాక్స్‌ మరణం. చాలా సంవత్సరాలుగా తన వద్ద పెరుగుతున్న జాక్స్‌ మరణం పూరిని బాగా ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆయన ఎమోషనల్‌ పోస్ట్‌ ను చూస్తే అర్థం అవుతుంది. జంతువులు మరియు పక్షులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ తన ఆఫీస్‌ లో వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించిన పూరి తాజాగా తన పెంపుడు కుక్క మరణించిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ - దానికి అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లుగా ఫొటో ద్వారా తెలియజేశాడు.

పూరి జాక్స్‌ తో తన అనుబంధాన్ని ట్విట్టర్‌ లో పంచుకున్నాడు.. వీడి పేరు జాక్స్‌ - ఎప్పుడు నాతోనే ఉండేది. ఒకానొక సమయంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా ఫ్రెండుకి ఇచ్చేశాను. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ తీసుకు వచ్చాను. కాని వాడు హర్ట్‌ అయ్యి అప్పటి నుండి నాతో మాట్లాడటం మానేశాడు. దగ్గరకు రాడు - నావైపు చూడడు - తోక కూడా ఊరి ఇప్పటికి 8 ఏళ్లు అయ్యింది. నేను లైఫ్‌ లో ఎంత మందిని బాధ పెట్టానో నాకు తెలియదు - కాని వీడిని మాత్రం చాలా బాధ పెట్టాను. వాడు ఇంక లేడు, ఈరోజు వాడికి చివరి రోజు అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.

పూరి ఎమోషనల్‌ ట్వీట్‌ కు పెద్ద ఎత్తున సెలబ్రెటీలు మరియు అభిమానులు స్పందించారు. పూరిని ఓదార్చుతూ ఎంతో మంది ట్వీట్‌ చేశారు. ఛార్మి, నిధి అగర్వాల్‌, హేమంత్‌ మధుకర్‌ ఇంకా పలువురు పూరి త్వరగా ఈ విషాదం నుండి బయటకు రావాలని కోరుకుంటూ ట్వీట్స్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రంను తెరకెక్కిస్తున్న పూరి త్వరగా ఈ విషాదం నుండి తేరుకుని సినిమాను పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.