Begin typing your search above and press return to search.

దేవుళ్లతో పెట్టుకుంటే ఇలా అవుతోందేంటి?

By:  Tupaki Desk   |   20 Feb 2017 2:05 PM GMT
దేవుళ్లతో పెట్టుకుంటే ఇలా అవుతోందేంటి?
X
ఈ రోజుల్లో ఆధ్యాత్మిక.. భక్తి.. పౌరాణిక సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి సినిమాలకు నిర్మాతలు దొరకడం చాలా కష్టం. ఐతే కొందరు నిర్మాతలు ఆ సాహసం చేస్తున్నారు. కానీ ఆ సాహసం ఆశించిన ఫలితాన్నివ్వడం లేదు. సినిమాలు ఆడినా.. ఆడకపోయినా ఈ తరహా చిత్రాలు తీసిన వాళ్లు కనుమరుగైపోతున్నారు.

రెండు దశాబ్దాల కిందట ‘అన్నమయ్య’ తీసిన వీఎంసీ దొరస్వామి రాజు.. ఆ తర్వాత ఎంతోకాలం ఇండస్ట్రీలో నిలబడలేదు. ‘సింహాద్రి’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఆయన.. ఆపై త్వరగా కనుమరుగైపోయారు. ఇక నాగార్జున-కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన రెండో ఆధ్యాత్మిక చిత్రం ‘శ్రీరామదాసు’ తీసి ఆదిత్య ప్రొడక్షన్స్ అధినేత కొండా కృష్ణం రాజు పరిస్థితీ అంతే. ఆయన ఆ తర్వాత సినిమాలే తీసినట్లు లేరు.

నిజానికి దొరస్వామి రాజు.. కొండా కృష్ణం రాజు ఇద్దరూ కూడా వాళ్లు నిర్మించిన ఆధ్యాత్మిక చిత్రాలు మంచి లాభాలు అందుకున్నా నిలబడలేకపోయారు. ఇక బాలయ్య ప్రధాన పాత్రలో ‘శ్రీరామరాజ్యం’ తీసిన సాయిబాబా కూడా నిలబడలేకపోయారు. ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి కానీ.. పెద్దగా డబ్బులు రాలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమానే రాలేదు. ఇక నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వరుసగా షిరిడి సాయి.. ఓం నమో వేంకటేశాయ సినిమాలు తీసిన మహేష్ రెడ్డి సంగతే ఇప్పుడు తేలాల్సి ఉంది.

‘షిరిడి సాయి’ ఆయనకు నష్టాలు తెచ్చిపెట్టినప్పటికీ ‘ఓం నమో వేంకటేశాయ’ చేయడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా మీద బాగానే ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా బాగా జరిగింది. కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. భారీ నష్టాలు తప్పేట్లు లేదు. అడ్వాన్స్ తో సినిమాను అమ్మిన ఏరియాల్లో నష్టాలు తప్పవు. మిగతా ఏరియాల్లోనూ బయ్యర్లకు సెటిల్మెంట్ చేయకుంటే కష్టం. మొత్తానికి వరుసగా ఆయనకు రెండో ప్రయత్నంలోనూ ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో తర్వాత సినిమాల్లో కొనసాగుతారో లేదో అన్నది సందేహమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/